Krunal Pandya : 2027 వన్డే ప్రపంచ కప్పై దృష్టి సారించిన కృనాల్ పాండ్యా.. బీసీసీఐకి కీలక సందేశం..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) అదరగొడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 11:58 AM IST
Krunal Pandya Eye On 2027 ODI World Cup Sends Clear Message To BCCI (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్లో అదరగొడుతున్న ఆర్సీబీ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా
- ముంబైతో మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్
- టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యం అని వెల్లడి
Krunal Pandya : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా అదరగొడుతున్నాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీనే తన లక్ష్యమని, అదే సమయంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 వన్డే ప్రపంచ కప్లో కూడా కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు కృనాల్ పాండ్యా తెలిపాడు.
ఆదివారం రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పిచ్ పై అస్థిర బౌన్స్తో పాటు అతడి శరీరం సహకరించకపోయినప్పటికి కూడా తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ మధ్యలో అతడి కాలు కండరాలు పట్టేసినప్పటికి కూడా 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు కృనాల్ 6 ఇన్నింగ్స్ల్లో 35.25 సగటుతో 150 కి పైగా స్ట్రైక్రేటుతో 141 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లో 8.70 ఎకానమీతో 10 వికెట్లు కూడా తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో కృనాల్ మాట్లాడుతూ.. తనకు ఆరేడు ఏళ్ల వయసు ఉన్నప్పుడే దేశం కోసం ఆడాలని కోరుకున్నానని తెలిపాడు. ఇప్పటికి తన కోరిక మారలేదన్నాడు. నూటికి నూరు శాతం దేశం కోసం ఆడటమే తన లక్ష్యం అని తెలిపాడు. ‘వచ్చే ఏడాది ప్రపంచకప్ ఉంది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. నేను బాగా రాణిస్తానని ఆశిస్తున్నాను. నాకు ఆ అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నా. అది నాకు, నాకు కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది అవుతుంది.’ అని కృనాల్ తెలిపాడు.
Andy Flower : ముంబై పై విజయం.. ఆర్సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్కు 15 శాతం జరిమానా
కృనాల్ పాండ్యా టీమ్ఇండియా తరుపున 5 వన్డేలు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 65 సగటు 101.56 స్ట్రైక్రేటుతో 130 పరుగులు చేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. 19 టీ20లు ఆడాడు. 10 ఇన్నింగ్స్ల్లో 24.80 సగటుతో 130కి పైగా స్ట్రైక్రేటుతో 124 పరుగులు చేశాడు. 15 వికెట్లు పడగొట్టాడు. చివరి సారిగా అతడు 2021జూలైలో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడు మరోసారి దేశం తరుపున ఆడాలని కోరుకుంటున్నాడు.
