Sreesanth and Gautam Gambhir Involved In Heated Exchange
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ల మధ్య గొడవ జరిగింది. లెజెండ్స్ లీగ్ 2023లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియా క్యాపిటల్స్కు గౌతమ్ గంభీర్, గుజరాత్ జెయింట్స్ తరుపున శ్రీశాంత్ లు ఆడుతున్నారు. గొడవకు గంభీరే కారణం అని మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ తెలిపాడు. తనని అసభ్యకర మాటలు అన్నాడని చెప్పాడు. సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లకు గంభీర్ మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు.
లెజెండ్స్ లీగ్లో భాగంగా ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీశాంత్ వేసిన ఓ ఓవర్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో గంభీర్ వైపు శ్రీశాంత్ సీరియస్గా చూడగా తగ్గేదేలే అంటూ గంభీర్ సైతం కోపంగా అతడి వైపు చూశారు. ఆ తరువాత కాసేపటికే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటేలా కనిపించింది. అయితే.. ఫీల్డింగ్ చేస్తున్న పలువురు ఆటగాళ్లతో పాటు అంపైర్లు వచ్చి వారిద్దరికి సర్దిజెప్పారు. మ్యాచ్ సజావుగా సాగేలా చూశారు.
Heated conversation between Gautam Gambhir and S Sreesanth in the LLC. pic.twitter.com/Cjl99SWAWK
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023
నా తప్పేమీ లేదు..
మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా శ్రీశాంత్ ఈ ఘటనపై స్పందించాడు. నిజాలు ఏంటో చెప్పేందుకే వచ్చానన్నాడు. ‘మిస్టర్ ఫైటర్’ గంభీర్ తో జరిగిన విషయంలో నా తప్పేమీ లేదు. ఆయన కారణం లేకుండానే గొడవలు పడుతుంటాడు. నేను ఏమీ అనక పోయినప్పటికీ అసభ్యకరమైన మాటలు అన్నాడు. ఏం అన్నాడు అనేది త్వరలోనే అందరికి చెబుతా. అలా మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటికే నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అభిమానుల మద్దతుతో పోరాడుతున్నా. అని శ్రీశాంత్ అన్నాడు.
సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లకు సైతం గంభీర్ మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైన కామెంట్రీ సమయంలో విరాట్ కోహ్లీ గురించి అడిగితే దాని గురించి మాట్లాడడని అన్నాడు. ఇతర విషయాలపై మాత్రం స్పందిస్తాడని చెప్పాడు.
IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటన ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ 30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 51 పరుగులు చేశాడు. అనంతరం క్రిస్గేల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు, కెవిన్ ఓబ్రెయిన్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసినప్పటికీ లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితమైంది. దీంతో 12 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ విజయం సాధించింది.