Paris Olympics : విశ్వ క్రీడలకు పారిస్ నగరం ముస్తాబైంది. నేడు (జూలై 26 శుక్రవారం) ఒలింపిక్స్ అధికారిక ప్రారంభ వేడుకలు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు గంటల పాటు అట్టహాసంగా ఈ వేడుకలు కొనసాగనున్నాయి. పారిస్లోని సెన్ నదిపై ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో స్టేడియంలో కాకుండా ఆరుబయట నదిలో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే.. భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 69 పతక ఈవెంట్లలో 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరిలో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని మరింత చాటాలని వీరంతా పట్టుదలతో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్లో సాధించిన (7 పతకాలను) పతకాలను మించి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగు తేజాలు..
ఒలింపిక్స్ క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటుండగా వీరిలో 8 మంది తెలుగు క్రీడాకారులు ఉన్నారు. వీరు బరిలోకి దిగి ఒత్తిడి అధిగమిస్తే చాలు పతకం సాధించడం ఖాయమే. మరీ ఆ తెలుగు తేజాలు ఎవరో చూద్దాం..
హ్యాట్రిక్ పై పీవీ సింధు కన్ను..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హ్యాట్రిక్ ఒలింపిక్ పతకం పై కన్నేసింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన ఆమె ఈ సారి కూడా పోడియం పై చోటే లక్ష్యంగా పారిస్ విమానం ఎక్కింది. అయితే.. ప్రస్తుతం సింధూ ఫామ్ కాస్త ఆందోళనకరంగానే ఉంది. కామన్వెల్త్ గేమ్స్లో గాయపడిన సింధు పునరాగమనంలో గొప్పగా రాణించలేకపోతుంది. అయితే.. పారిస్లో తన సత్తాచాటాలనే ధీమాతో ఆమె ఉంది.
Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ కొడుకుకు లక్కీ ఛాన్స్.. సమిత్ కెరీర్లో తొలిసారి..
బ్యాడ్మింటన్లో సాత్విక్..
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన సాత్విక్ పై ఎన్నో ఆశలు ఉన్నాయి. చిరాగ్ శెట్టితో కలిసి ఈ సీజన్లో ఎన్నో సంచలనాలను సృష్టించాడు. కామెన్వెల్లో డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ జోడి స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్ షిప్లో కాంసం, ఫ్రెంచ్ ఓపెన్ తో తొలి సూపర్-750 సిరీస్ టైటిల్లతో పాటు ఇండోనేసియా ఓపెన్ సూపర్-1000 సిరీస్ను ఈ జోడీ నెగ్గింది. ఈ క్రమంలో పారిస్లో పతకమే లక్ష్యంగా ఈ జోడీ బరిలోకి దిగుతోంది.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ పారిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బాక్సింగ్లో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. కామెన్వెవెల్తలో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ను సాధించింది.
ఆకుల శ్రీజ..
టేబుల్ టెన్నిస్లో హైదరాబాద్కు చెందిన ఆకుల శ్రీజ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచింది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్లలో పోటీపడుతోంది. మరో హైదరాబాదీ అమ్మాయి ఈషా సింగ్ షూటింగ్ విభాగంలో పోటీపడుతోంది.
జ్యోతి యర్రాజి..
100 మీటర్ల హర్డిల్స్లో విశాఖపట్నం చెందిన యర్రాజి జ్యోతి బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడుతున్న తొలి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకు ఎక్కింది. ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామెన్వెల్త్ పతకాలు, జాతీయ పోటీల్లో పది పతకాలను సాధించింది.
దండి జ్యోతికశ్రీ
4×400 రిలే ఈవెంట్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దండి జ్యోతికశ్రీ భారత్కు ప్రాతినిథ్యం వహించనుంది. రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.
బొమ్మదేవర ధీరజ్
విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ గతేడాది ఆసియా క్వాలిఫయర్స్లో సత్తాచాటి ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఆర్చరీలో దేశానికి తొలి పతకం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.