IPL 2025లో మ్యాచ్​ ఫిక్సింగ్? ప్లేయర్లకు హైదరాబాద్​ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు?

ఇండియన్ ప్రీమియల్​ లీగ్​-ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు.

IPL 2025 సీజన్‌లో మ్యాచ్ ​ఫిక్సింగ్ జరిగిందా? ప్లేయర్లకు హైదరాబాద్​ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు ఇచ్చాడా? అందుకే అన్ని ఫ్రాంచైజీలకు జాగ్రత్తగా ఉండాలని BCCI వార్నింగ్ ఇచ్చిందా? ఇంతకీ ఆ హైదరాబాద్ వ్యాపారవేత్త ఎవరు? బీసీసీఐ వార్నింగ్ ఇచ్చేంతగా అసలేం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ.

IPLలో మ్యాచ్​ఫిక్సింగ్​జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ సీజన్​లో ఫిక్సింగ్​కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో బీసీసీఐ అలెర్ట్ అయింది. వెంటనే IPLలోని 10 ఫ్రాంచైజీలకు వార్నింగ్ నోటీసులు ఇచ్చింది.

హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్త జట్ల ఆటగాళ్లు, కోచ్​లు, సపోర్ట్​స్టాఫ్, కామెంటేటర్లనూ సైతం వదలకుండా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్-ACSUకి కీలక సమాచారం అందింది. పుంటెర్స్, బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. అతడు ఇప్పటికే పలు వివాదాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని సమాచారం. అలాంటి వ్యక్తి ఐపీఎల్​టీంలతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ACSUకు తెలిపిందట. వ్యాపారవేత్తతో ఏవైనా సంభాషణలు జరిపితే తమకు నివేదించాలని ACSU కోరిందట.

ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్​కు వెళ్లాడా?
హైదరాబాద్ కు చెందిన సదరు వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు, ఆభరణాలతో బుట్టలో పడేస్తాడని ACSU తెలిపింది. ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లకు, కోచ్​లను కలిసి ఖరీదైన గిఫ్ట్​లు కూడా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్​కు వెళ్తాడంట. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేటు పార్టీలకు కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అంతేకాదు సదరు వ్యాపారవేత్త- ప్లేయర్లు, కోచ్‌లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో కూడా ఎవరైన వ్యక్తి సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. ఇలాంటి ఆన్​లైన్ కాంటాక్ట్స్‌ ఫిక్సింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ACSU కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇండియన్ ప్రీమియల్​ లీగ్​-ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్​లో ఈ పొట్టి ఫార్మాట్​ లీగ్​కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికోసారి జరిగే ఈ లీగ్ గురించి భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు దీని గురించే తెగ మాట్లాడుకుంటారు. ఐపీఎల్ సీజన్​లో క్రికెట్​ను ఎంజాయ్​ చేసేవారు ఉన్నట్లే, లీగ్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఇంతకీ ఐపీఎల్ ఆటగాళ్లకి గాలం వేసిన ఆ హైదరాబాద్ కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరై ఉంటారని అంతా ఆరా తీస్తున్నారంట. అటు క్రికెట్ ప్రేమికులే కాదు…ఇటు రాజకీయవేత్తలు సైతం ఆయనెవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంట.