Mohsin Naqvi statement after ICC rejected Pakistan demands amid boycott U-turn
Mohsin Naqvi : టీ20 ప్రపంచ కప్2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించడంపై పాకిస్థాన్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తమ కోసం తాము ఏమీ డిమాండ్ చేయలేదని చెప్పాడు. మొత్తం బంగ్లాదేశ్ కోసమే చేసినట్లుగా అర్థం వచ్చేలా మాట్లాడాడు.
భద్రతా కారణాలను చూపుతూ టీ20 ప్రపంచకప్లో తమ జట్టు ఆడే మ్యాచ్లను భారత్ లో ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి చెప్పింది. శ్రీలంకకు తరలించాలని కోరింది. తాము నిర్వహించిన సమీక్షలో భారత్లో బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని తేలిందని, నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీబీకి ఐసీసీ సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో వేదికను మార్చే ప్రసక్తే లేదని అంది.
అయినప్పటికి కూడా బంగ్లాదేశ్ మెట్టు దిగకపోవడంతో ఆ జట్టును తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. దీంతో బంగ్లాదేశ్కు మద్దతుగా ఫిబ్రవరి 15న భారత్తో ఆడే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ తెలిపింది.
పాక్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ముందు రోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారులతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ను తిరిగి ప్రారంభించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మీడియా నివేదికల ప్రకారం.. భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను తిరిగి ప్రారంభించాలని ఐసీసీని కోరడమే కాకుండా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో కూడిన ముక్కోణపు సిరీస్ను కూడా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీని పాక్ కోరింది.
అయితే.. ఈ రెండు డిమాండ్లను ఐసీసీ అంగీకరించలేదు. ఇది పరిధిలో లేదని తెలిపింది. అయినప్పటికి కూడా బంగ్లాదేశ్ కోసమే తాము నిలబడ్డామని, తమ కోసం ఏమీ అడగలేదని నఖ్వీ పేర్కొనడం గమనార్హం.
పాకిస్థాన్ సూపర్ లీగ్ విలేకరుల సమావేశానికి సోమవారం మొహ్సిన్ నఖ్వీ వచ్చాడు. ఈ సమావేశం ముగిసిన తరువాత ఓ ఇంటర్వ్యూయర్ భారత్తో పాక్ బహిష్కరణ వైఖరి గురించి అడిగారు.
మొహ్సిన్ నఖ్వీ : బాస్ అబ్ థోడి డెర్ మే ఫైస్లా హో జాయేగా (కొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోబడుతుంది)
ఇంటర్వ్యూయర్ : శుభవార్త రాబోతోందా?
మొహ్సిన్ నఖ్వీ: హమ్ తో హర్ వక్త్ అచీ ఖబర్ హై దేతే హై (మేము ఎల్లప్పుడూ శుభవార్తలను అందిస్తాము)
మొహ్సిన్ నఖ్వీ : మీరు బంగ్లాదేశ్ ప్రకటనను చూసి ఉంటారు. బంగ్లాదేశ్.. పాకిస్తాన్ను మ్యాచ్ ఆడమని అభ్యర్థించింది. స్పష్టంగా.. వారి సమస్యలు పరిష్కరించబడ్డాయి. అందుకే వారు ఈ అభ్యర్థన చేశారు.
ఇంటర్వ్యూయర్: మన డిమాండ్లలో దేనికైనా వారితో అంగీకరించమని మనం ఒత్తిడి చేశామా ?
మొహ్సిన్ నఖ్వీ: మేము బంగ్లాదేశ్ తరపున నిలబడ్డాం. అది వారి గురించే.. మేము మాకోసం ఏమీ చేయలేదు. అని అన్నాడు.
Mohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3
— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026