Rishabh Pant: ప్రమాదం తర్వాత పంత్ తొలి ట్వీట్.. సర్జరీ గురించి ఏం చెప్పాడంటే
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
- Narender Thiru
- Updated on- January 16, 2023 / 09:04 PM IST
Rishabh Pant: భారతీయ క్రికెటర్ రిషబ్ పంత్ గత నెల 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Pawan Kalyan: ‘వారాహి’కి పూజ.. కొండగట్టుకు జనసేనాని పవన్ కల్యాణ్
మొదట డెహ్రడూన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందగా, తర్వాత మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ అతడ్ని ముంబైలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు. ప్రమాదానికి గురైన తర్వాత ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. ‘‘నాకు సహకరించిన వాళ్లకు, ప్రార్థించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. నా సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ప్రమాదం నుంచి కోలుకుంటున్నాను. ఇకపై ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను.
నా అభిమానాలు, సన్నిహితులు, తోటి ఆటగాళ్లు, డాక్టర్లు, బీసీసీఐ.. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను” అని రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు. త్వరలో అందరినీ మైదానంలో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పంత్ ఉన్న పరిస్థితి దృష్ట్యా రాబోయే ఐపీఎల్ సీజన్లో అతడు ఆడే అవకాశాలు లేవు. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశాడు.
అయితే, ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్ వరకైనా అందుబాటులోకి వస్తాడో లేదో తెలీదు. మరోవైపు పంత్ కనీసం ఏడాదిన్నరపాటు ఆటకు దూరం కావొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో ఇప్పుడే ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేమని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
