Babar Azam
Babar Azam captaincy : వన్డే ప్రపంచకప్లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ చేతుల్లో ఓడిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచుల్లో ఓటములను పాక్ అభిమానులు జీర్ణించుకున్నప్పటికీ చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్ పై అఫ్గాన్కు ఇదే మొదటి విజయం కావడం గమనార్హం.
దీంతో పాకిస్థాన్పై జట్టుపై మాజీ క్రికెట్లరతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజాం పై దుమ్మెత్తి పోస్తున్నారు. వెంటనే బాబర్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఆటగాళ్లు వసీమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, హఫీజ్, జావేద్, షోయబ్ మాలిక్, మొయిన్ ఖాన్, షోయబ్ అక్తర్ ఇలా పాక్ మాజీ ఆటగాళ్లు అందరూ అఫ్గానిస్థాన్ చేతిలో పాక్ ఓటమికి కారణం బాబర్ ఆజాం అని ఆరోపిస్తున్నారు.
Hardik Pandya : ఇంగ్లాండ్ తో మ్యాచ్ కూ హార్దిక్ పాండ్యా దూరం..! రీఎంట్రీ ఎప్పుడంటే?
వసీం అక్రమ్ మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్ మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉందన్నాడు. ఒక్కరిలో కూడా మ్యాచ్ గెలవాలనే పట్టుదల కనిపించలేదన్నాడు. 283 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చునని, అయితే.. వారిలో ఆ ఉద్దేశ్యమే కనిపించలేదన్నారు. బౌలింగ్ చాలా సాధారణంగా ఉందని, ఇక ఫీల్డింగ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. కెప్టెన్సీ మార్పు విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. అకీబ్ జావెద్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్ అనంతరం బాబర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు. అతడి స్థానంలో మరొకరికి అవకావం ఇవ్వాల్సి ఉందన్నాడు. తన దృష్టిలో షహీన్ అఫ్రిది అందుకు సమర్ధుడు అని చెప్పాడు.
బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదు..
బాబర్ కెప్టెన్సీ దారుణంగా ఉందని, బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదని మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. ముఖ్యంగా హారిస్ రవూఫ్ ను పవర్ ప్లేలోనే తీసుకురావడం పెద్ద తప్పిదమని చెప్పాడు. మొదటి ఓవర్లోనే అతడు భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లుగా కనిపించిదన్నాడు. అతడు బౌలింగ్ చేసేటప్పుడు కూడా బాబర్ సరైన ఫీల్డింగ్ను ఏర్పాటు చేయలేదన్నాడు.
అటు పీసీబీ కూడా..!
బాబర్ ఆజాం కెప్టెన్సీ పై అటు పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే అతడి కెప్టెన్సీపై వేటు పడవచ్చునని తెలిపింది. రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది లలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశాలను పీసీబీ పరిశీలిస్తోందన్నారు. ప్రపంచకప్ ముగిసిన తరువాత పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు కొత్త కెప్టెన్ను నియమించవచ్చునని వార్తలు వస్తున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడింది. రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. వరుస ఓటములతో పాక్ తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.