IND vs PAK : భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్.. పాక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు భయ్యా..
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : February 21, 2025 / 10:37 AM IST
Pakistan penalised for slow over-rate in Champions Trophy opener against New Zealand
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్కు ఏ ఒక్కటి కలిసిరావడం లేదు. ఢిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి తొలి మ్యాచ్లోనే పరాజయం పాలైంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగులతో ఓడిపోయింది. దీంతో పాక్ నెట్ రన్రేట్ -1.200 కి పడిపోయింది. ఇంకోవైపు ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. కివీస్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఫఖార్ గాయపడ్డాడు. ఇక ఇప్పుడు మరో షాక్ తగిలింది.
న్యూజిలాండ్తో మ్యాచ్లో స్లో ఓవర్రేట్ను కొనసాగించినందుకు ఐసీసీ పాక్ జట్టుకు జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానాగా విధించింది. కివీస్ తో మ్యాచ్లో పాక్ నిర్ణీత సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేసింది. దీనిపై ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, షర్ఫుద్దౌలా, థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, నాల్గవ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఫిర్యాదు చేశారు. పరిశీలించిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానా విధించారు. పాక్ కెప్టెన్ రిజ్వాన్ తప్పును అంగీకరించాడని దీంతో తదుపరి ఇంకే విచారణ అవసరం లేదని రిఫరీ తెలిపాడు. కాగా.. మరోసారి ఇదే ఘటన పునరావృతమైతే మాత్రం కెప్టెన్పై మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.
కనీస ఓవర్-రేట్ కు సంబంధించిన ICC నిబంధనలు ఇలా ఉన్నాయి. ఆర్టికల్ 2.22 ప్రకారం ఏదైన జట్టు నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విపలం అయితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో కోత విధించబడుతుంది. నిర్ణీత సమయం కన్నా ఎన్ని తక్కువ ఓవర్లు వేశారో.. ప్రతి ఓవర్కు 5 శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించబడుతుంది.
భారత్తో డూ ఆర్ డై..
ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఆశలు నిలుపుకోవాలంటే భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ తప్పక గెలవాల్సి ఉంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే దాదాపుగా సెమీస్కు చేరుకుంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఇంతటి కీలక మ్యాచ్కు ఫఖార్ జమాన్ దూరం కావడం ఆజట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. 2017 ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పై ఫఖార్ శతకంతో చెలరేగాడు. కాగా.. ఫఖార్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ను తీసుకునేందుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఓకే చెప్పింది.
ఇక పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశతో తమ చివరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 27న ఆడాల్సి ఉంది. భారత్, బంగ్లాదేశ్ పై విజయం సాధించినా సెమీస్కు చేరే అవకాశాలు పాక్కు తక్కువగానే ఉన్నాయి. మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
