IND vs PAK : టీమ్ఇండియా ప్రాక్టీస్ చేస్తుండగా.. అదే మైదానానికి వచ్చిన పాక్ ఆటగాళ్లు.. తరువాత ఏం జరిగిందంటే..?
మంగళవారం దుబాయ్లోని ఐసీసీ అకాడమీలోని మైదానంలో టీమ్ఇండియా ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడికి పాక్ ఆటగాళ్లు (IND vs PAK) కూడా వచ్చారు.
- Thota Vamshi Kumar
- Published On : September 17, 2025 / 12:41 PM IST
Pakistan Team Arrives To Train On Same Ground As India practice
IND vs PAK : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా ఇప్పటికే సూపర్4కి అర్హత సాధించింది. గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్ను ఒమన్తో శుక్రవారం ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాళ్లు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో పాక్ టీమ్ కూడా అక్కడకు వచ్చింది.
భారత్తో పాటు పాక్, ఒమన్, యూఏఈలు గ్రూపు-ఏలో ఉన్నాయి. టీమ్ఇండియా ఇప్పటికే సూపర్4లో అడుగుపెట్టగా.. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన ఒమన్ జట్టు రేసు నుంచి నిష్ర్కమించింది. రెండో బెర్తు కోసం పాక్, యూఏఈలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్4లో అడుగుపెట్టనుంది.
భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ జట్టు యూఏఈతో జరగనున్న మ్యాచ్లో గెలిచి సూపర్4కి వెళ్లాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో సాధన చేసేందుకు మంగళవారం ఐసిసి అకాడమీ మైదానానికి వచ్చింది. అయితే.. అంతకంటే ముందుగానే మైదానంలో టీమ్ఇండియా ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. వారు అప్పటికి ప్రాక్టీస్ ప్రారంభించి గంట కూడా కాలేదు.
ఆదివారం (సెప్టెంబర్ 14న) భారత్, పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకమార్ యాదవ్తో పాటు భారత ఆటగాళ్లు ఎవ్వరూ కూడా పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. దీనిపై పాక్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వివాదం తరువాత తొలిసారి భారత్, పాక్ ఆటగాళ్లు మంగళవారం దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.
Handshake Row : ఐసీసీ యూటర్న్..! పాక్కు స్వల్ప విజయం.. ఆండీ పైక్రాఫ్ట్ ఎంత పనాయే..
అయితే.. భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్లో తాము నిమగ్నం కాగా.. పాక్ జట్టు తమకు కేటాయించిన నెట్స్ వద్దకు వెళ్లి ప్రాక్టీస్ చేసింది. అటు భారత హెడ్ కోచ్ గంభీర్, ఇటు పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ కూడా అక్కడే ఉండి తమ తమ జట్ల ప్రాక్టీస్ను పర్యవేక్షించారు.
