బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చుక్కలు చూపిస్తున్న ప్లేయర్లు.. రాజీనామా చేయాల్సిందే.. స్టేడియానికి రాని ఆటగాళ్లు..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) కష్టాలు తప్పడం లేదు.
- Thota Vamshi Kumar
- Published On : January 15, 2026 / 02:32 PM IST
Bangladesh Players boycott delays BPL match amid standoff with BCB
- ఇంకా ప్రారంభం కానీ బీపీఎల్ మ్యాచ్
- హోటల్ గదుల్లోనే ఉండిపోయిన ఆటగాళ్లు
- దిక్కుతోచని స్థితిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
BCB : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు టీ20 ప్రపంచకప్ 2026లో తమ దేశం ఆడే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బీసీబీ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రపంచకప్ను బహిష్కరించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంది. ఇక ఇదే సమయంలో ఆటగాళ్లు అందరూ కలిసి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ను బహిష్కరించారు.
గురువారం షెడ్యూల్ ప్రకారం మీర్పూర్లో చట్టోగ్రామ్ రాయల్స్, నోఖాలి ఎక్స్ప్రెస్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా 1 గంటకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఇరు జట్ల ఆటగాళ్లు ఇంకా స్టేడియానికి చేరుకోలేదు. హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పడిపోయింది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. పాక్ పర్యటన..
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఎం నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం. ఆయన బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాబ్తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లను ఇండియా ఏజెంట్లు అని విమర్శించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేస్తేనే ఆటగాళ్లు మ్యాచ్లు ఆడతారని వెల్లడించింది.
పరిస్థితిని చక్కదిద్దడానికి బీసీబీ, సీడబ్ల్యూఏబీ అధికారుల మధ్య బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
IND vs NZ : మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్ కామెంట్స్ వైరల్
ఈ క్రమంలోనే గురువారం దేశ వ్యాప్తంగా జరగాల్సిన దేశీయ మ్యాచ్లతో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆటగాళ్లు బహిష్కరించారు. నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేసే వరకు మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని వారు బీష్మించుకుని కూర్చున్నారు. ఈ పరిణామంతో బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు, టికెట్లు కొన్న అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. లీగ్ మధ్యలో ఇలా జరగడంతో బంగ్లా క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ పెద్దలు ఆగమేఘాల మీద ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నారు. కాస్త ఆలస్యమైనప్పటికి కూడా చట్టోగ్రామ్ రాయల్స్, నోఖాలి ఎక్స్ప్రెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా చూసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
