Rishabh Pant : భూమి కావాలంటూ అర్థ‌రాత్రి రిష‌బ్ పంత్ పోస్ట్‌.. స్పందించిన సీఎం.. నిజం కాద‌ని ఫ్యాన్స్ అనుమానం..

టీమ్ఇండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) అర్థ‌రాత్రి ఓ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.

Rishabh Pant made a personal appeal to Uttarakhand Chief Minister Pushkar Singh Dhami

Rishabh Pant : టీమ్ఇండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ అర్థ‌రాత్రి ఓ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. తన స్వస్థలమైన ఉత్తరాఖండ్‌లో ఇల్లు నిర్మించుకోవ‌డానికి స్థ‌లం కావాల‌ని అడుగుతూ ఆ రాష్ట్ర సీఎంను ట్యాగ్ చేశాడు. ఇందుకు ఉత్త‌రాఖండ్ రాష్ట్రం సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ సైతం స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా పంత్‌కు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం టీమ్ఇండియాతో క‌లిసి శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. శ‌నివారం తెల్ల‌వారుజామున 12.56 నిమిషాల‌కు పంత్ ఖాతా నుంచి వ‌రుస ట్వీట్లు వ‌చ్చాయి.

‘నమస్కారం సార్, ఎలా ఉన్నారు. నేను ఉత్తరాఖండ్‌కు చెందిన వాడినే అయినా చాలా కాలంగా బ‌య‌ట‌నే ఉంటున్నాను. నేను ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌కు వ‌చ్చి స్థిర‌ప‌డాల‌ని కోరుకుంటున్నాను. అందుక‌నే ఇంటిని నిర్మించుకోవ‌డానికి అనువైన స్థం కోసం మూడేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాను. అయిన‌ప్ప‌టికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నాకు స‌రైన స్థ‌లం దొర‌క‌లేదు. మ‌న రాష్ట్రం అంటే నాకు ఎంతో ప్రేమ‌. భూమి సేక‌ర‌ణ విష‌యంలో నాకు స‌హాయం చేయాల‌ని విన్న‌వించుకుంటున్నాను. నా సొంత రాష్ట్ర అభివృధ్ధికి తోడ్పాటు అందించాల‌ని భావిస్తున్నాను. ద‌య‌చేసి ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కోరుతున్నాను. మీ స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటాను.’ అని పంత్ ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

ఆ త‌రువాత మ‌రో ట్వీట్‌లో.. ‘అంతర్జాతీయ స్థాయిలో మ‌న రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హించినందుకు బ‌హుమ‌తిగా ఏదైన ఇస్తే బాగుంటుంది. మీరు అనుమతిస్తే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆ స్థలాన్ని కొనుగోలు చేసి, నా సొంత రాష్ట్రంలో నా మొదటి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నాను. దయచేసి దీనికి సహకరించండి.’ అని పంత్ తెలిపాడు

స్పందించిన సీఎం..

‘ప్రియమైన రిషబ్.. మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణం. మీ అద్భుతమైన ప్రదర్శన, విజయాలతో, మీరు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘దేవభూమి’ కీర్తిని ఇనుమడింపజేశారు. మాతృభూమిపై మీకు ఉన్న ప్రేమ, ఇక్కడికి తిరిగి వచ్చి మీ వంతు కృషి చేయాలనే మీ భావన ఎంతో అభినందనీయం. మీరు అడిగిన‌ అంశానికి సంబంధించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తాము. వారు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు. నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైనంత సహకారం అందేలా చూస్తారు.’ అని ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ రిప్లై ఇచ్చారు.

నిజం కాదా?

రిష‌బ్ పంత్ వ‌రుస పోస్టుల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దేశంలో అత్య‌ధికంగా ట్యాక్స్ క‌ట్టే వ్య‌క్తికి.. ప్ర‌భుత్వం నుంచి నిజంగా సాయం అవ‌స‌ర‌మా? అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. పంత్ పోస్టులో గ్రామ‌ర్ త‌ప్పులు ఉన్నాయ‌ని మ‌రొక‌రు చెప్పుకొచ్చారు. అత‌డి ఖాతా హ్యాక్‌కు గురై ఉండొచ్చున‌ని ఇంకొక‌రు అనుమానం వ్య‌క్తం చేశారు. శ్రీలంక‌తో వార్మ‌ప్ మ్యాచ్ ఆడుతూ అర్థ‌రాత్రి ఇలా పంత్ పోస్టు చేసే అవ‌కాశం లేద‌ని ఫ్యాన్స్ చెబుతున్నారు.