Rishabh Pant : టీమ్ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు రిషబ్ పంత్ దూరం..!
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. రిషబ్ పంత్ (Rishabh Pant) ఈ సిరీస్కు..
- Thota Vamshi Kumar
- Published On : September 23, 2025 / 10:11 AM IST
Rishabh Pant to miss West Indies Tests Report
Rishabh Pant : ఆసియాకప్ 2025 అనంతరం భారత జట్టు వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విండీస్తో పాల్గొనే జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సిరీస్కు రిషబ్ పంత్ (Rishabh Pant) దూరం కానున్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్టు మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్తో చివరి టెస్టుతో పాటు ఆసియాకప్ 2025కి కూడా పంత్ దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న పంత్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోని పునరావాస శిబిరంలో ఉన్నాడు.
అయితే.. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు విండీస్తో సిరీస్తో పాటు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్కు దూరం కానున్నాడని సదరు వార్తల సమాచారం. పంత్ తిరిగి ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడు అన్నదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
పడిక్కల్, ధ్రువ్ జురెల్లకు ఛాన్స్..
రిషబ్ పంత్ దూరం కానుండడంతో విండీస్తో సిరీస్కు వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ ఎంపిక కానున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో కూడా పంత్ దూరమైనప్పుడు జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలను నిర్వర్తించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులోనూ 140 పరుగులతో రాణించాడు. ఇక ఇదే మ్యాచ్లో 150 పరుగులతో రాణించిన దేవ్దత్ పడిక్కల్ కూడా విండీస్తో సిరీస్కు ఎంపిక అయ్యే ఛాన్స్లు ఉన్నాయి.
అయితే.. దాదాపు 8 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతడికి విండీస్తో సిరీస్కు చోటు దక్కుతుందా లేదా అన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడా లేదో చూడాల్సిందే.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు మ్యాచ్ – అక్టోబర్ 2 నుంచి 6 వరకు (అహ్మదాబాద్)
* రెండో టెస్టు మ్యాచ్ – అక్టోబర్ 10 నుంచి 14 వరకు (ఢిల్లీ)
