Rishabh Pant : రీఎంట్రీలో విఫలమైన రిషబ్ పంత్.. 20 బంతులు ఆడి..
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో పంత్ (Rishabh Pant) తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : October 31, 2025 / 03:15 PM IST
SA A vs IND A Rishabh Pant falls for just 17 on injury comeback
Rishabh Pant : గాయం కారణంగా మూడు నెలలు ఆటకు దూరంగా ఉన్న టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ మ్యాచ్లో విఫలం అయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో పంత్ తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్ల సాయంతో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఒకుహ్లే సెలె బౌలింగ్లో జుబైర్ హంజా క్యాచ్ అందుకోవడంతో పంత్ పెవిలియన్కు చేరుకున్నాడు.
ఈ ఏడాది జూలై 23న ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో రివర్స్ స్వీప్ ఆడే క్రమంలో పంత్ పాదానికి గాయమైంది. దీంతో అతడు ఇంగ్లాండ్తో ఐదో టెస్టుతో పాటు స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు దూరం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
నవంబర్ 14 నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో చోటే లక్ష్యంగా భారత్-ఏ తరుపున పంత్ సఫారీ-ఏతో ఆడుతున్నాడు.
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా-ఏ జట్టు 309 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్ (71; 140 బంతుల్లో 8 ఫోర్లు), జుబైర్ హంజా (66; 109 9 ఫోర్లు, 1 సిక్స్), రూబిన్ హెర్మాన్ (54; 87 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత్-ఏ రెండో రోజు టీ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. క్రీజులో తనుష్ కొటియన్ (4), ఆయుష్ బదోని (1) లు ఉన్నారు. భారత బ్యాటర్లలో ఆయుష్ మాత్రే (65) హాప్ సెంచరీ చేయగా, సాయి సుదర్శన్ (32) పర్వాలేదనిపించాడు. దేవ్దత్ పడిక్కల్ (6), రజత్ పాటిదార్ (19)లు విఫలం అయ్యారు.
