Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా..? సరిగ్గా 18 ఏళ్ల క్రితం..
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2005 డిసెంబర్ 10న సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : December 10, 2023 / 05:39 PM IST
Sachin Tendulkar surpassed Sunil Gavaskar
Sachin Tendulkar surpassed Sunil Gavaskar : భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2005 డిసెంబర్ 10న సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అప్పటి నుంచి ఈ రికార్డు సచిన్ పేరిటే ఉంది.
2005లో భారత్, శ్రీలంక జట్లు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచులో టెండూల్కర్ 177 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి సెంచరీ సాధించాడు. టెస్లుల్లో సచిన్కు ఇది 35వ సెంచరీ. ఈ క్రమంలో అతడు సుదీర్ఘ పార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ (34) రికార్డును బద్దలు కొట్టాడు. అప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది.
కాగా.. సచిన్ తన కెరీర్లో టెస్టుల్లో మొత్తం 51 శతకాలు చేశాడు. ఇప్పటికీ కూడా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. అయితే.. వన్డేల్లో మాత్రం ఇటీవల విరాట్ కోహ్లీ సచిన్ శతకాల రికార్డును బద్దలు కొట్టాడు.
56 పరుగులకే రెండు వికెట్లు..
ఈ మ్యాచులో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. గౌతమ్ గంభీర్ (2), రాహుల్ ద్రవిడ్ (24) లు విఫలం కావడంతో 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అయితే.. లక్ష్మణ్ (69), గంగూలీ(40) సహకారంతో సచిన్ టీమ్ఇండియాను ఆదుకున్నాడు. 196 బంతుల్లో 109 పరుగులు చేశాడు. దీంతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 290 పరుగులు చేసింది. లంక బౌలర్లో ముత్తయ్య మురళీధరన్ ఏడు వికెట్లు తీశాడు.
అనంతరం మహేలా జయవర్థనే (60), మార్వన్ ఆటపట్టు(88) రాణించడంతో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే ఆరు వికెట్లతో రాణించాడు. ఆతరువాత రెండో ఇన్నింగ్స్లో ఇర్ఫాన్ పఠాన్ (93), ద్రవిడ్ (53), యువరాజ్ సింగ్ (77), ధోని (51)లు రాణించడంతో లంక ముందు 436 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే..లంక 247 పరుగులకే కుప్పకూలడంతో 188 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది.
