Wrestlers Protest: ఒకరినొకరు తిట్టుకున్న రెజ్లర్లు సాక్షి మాలిక్‌ – బబితా ఫొగట్

బబిత ఫొగట్, త్రినాథ్ రానాకు చురకలు అంటిస్తూ తాము శనివారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు సాక్షి మాలిక్ వివరించింది.

Sakshi and Babita

Wrestlers Protest – Babita Phogat: రెజ్లర్లు సాక్షి మాలిక్ (Sakshi Malik), సత్యవర్త్ కడియాన్ (Satyawart Kadian)పై తోటి రెజ్లర్ బబితా ఫొగట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షి మాలిక్, బబితా ఫొగట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బబితా ఫొగట్ బీజేపీ (BJP )నాయకురాలన్న విషయం తెలిసిందే.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన పోరాటంలో బబితా ఫొగట్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారని సాక్షి మాలిక్ చెప్పింది. దీంతో సాక్షి మాలిక్ ను కాంగ్రెస్ తోలుబొమ్మలా మారిందని బబితా ఫొగట్ మండిపడింది.

రెజ్లర్ల మధ్య ఫైట్ ఇలా షురూ..
శనివారం సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్ వీడియో రూపంలో మాట్లాడుతూ… రెజ్లర్ల ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని కొందరు అంటున్నారని చెప్పారు. అందులో నిజం లేదని, జనవరిలో జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద రెజ్లర్ల ఆందోళన కోసం అనుమతులను బీజేపీ నేతలు త్రినాథ్ రానా, బబితా ఫొగట్ తీసుకున్నారని చెప్పారు. తమతో కాంగ్రెసే ఆందోళన చేయిస్తోందని ఎలా చెబుతారని నిలదీశారు.

సాక్షి మాలిక్ మరో ట్వీట్..

ఈ వ్యాఖ్యలపై ఇవాళ పూర్తిగా స్పష్టతనిస్తూ సాక్షి మాలిక్ మరో ట్వీట్ చేసింది. బబిత ఫొగట్, త్రినాథ్ రానాకు చురకలు అంటిస్తూ తాము శనివారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరించింది. రెజ్లర్లను స్వార్థపర ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారన్న విషయాన్ని తెలపడానికి అలా అన్నామని చెప్పింది.

అయితే, తాము అంటించిన చురకలను అర్థం చేసుకునే శక్తి లేకుండాపోయిందని ఎద్దేవా చేసింది. రెజ్లర్లు కష్టాల్లో ఉన్న సమయంలో బబిత ఫొగట్, త్రినాథ్ రానా ప్రభుత్వం వైపు నిలబడ్డారని సాక్షి మాలిక్ విమర్శించింది. జనవరిలో రెజ్లర్లు ఆందోళనకు దిగిన సమయంలో బబితా ఫొగట్ రెజ్లర్లకు, ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరడంలో కీలక పాత్ర పోషించింది.

సాక్షిపై బబిత గరం గరం..

ఇవాళ సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. రెజ్లర్ల ఆందోళనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పింది. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే విషయంలో తాను మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నానని తెలిపింది.

” నా సోదరి, ఆమె భర్త పోస్ట్ చేసిన వీడియో చూసి చాలా బాధపడ్డాను. జనవరిలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరుతూ పోలీసులకు రాసిన లేఖపై నా సంతకం లేదు. ఆ విషయంలో నాకే సంబంధమూ లేదు ” అని బబితా ఫొగట్ తెలిపింది. తనకు ప్రధాని మోదీపై, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, నిజాలు బయటకు వస్తాయని పేర్కొంది.

మోదీని, అమిత్ షాను కలవాలని తాను రెజ్లర్లకు చెబితే, వారు వెళ్లి దీపేందర్ సింగ్ హుడా, ప్రియాంకా గాంధీలాంటి వారిని కలిశారని పేర్కొంది. ఆందోళన జరిగిన తీరును బట్టి రెజ్లర్లు కాంగ్రెస్ తోలుబొమ్మలుగా మారారని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పింది. మరోవైపు, రానా కూడా సాక్షిమాలిక్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

Wrestlers Protest: సాక్షి మాలిక్, ఆమె భర్త చెప్పిన విషయాలు అసత్యాలు: మైనర్ రెజ్లర్ తండ్రి