Sania Mirza
Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం విధితమే. ఇటీవల దుబాయ్లో జరిగిన దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్లోనే సానియా – మాడిసన్ కీస్ జోడీ ఓటమి పాలైంది. తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని ఆమె అభిమానులు ఆశించినప్పటికీ ఓటమితో సానియా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో సానియా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, మరోసారి సానియా మీర్జా టెన్నిస్ బ్యాట్ పట్టనుంది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడటం ద్వారా తన టెన్నిస్ కెరీర్కు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం సిద్ధమవుతోంది.
Sania Mirza
దుబాయ్లో ప్రొఫెషనల్ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన సానియా మీర్జా మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్లతో ఆటకు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. మార్చి 5న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్ లలో ఆమె బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లలో సానియాతో పాటు గతంలో ఆమెతో కలిసి ఆడిన ఇవాన్ డోడిగ్, రోహన్ బోపన్న, కారా బ్లాక్, బెతానీ మాటెక్, మరియన్ బర్తోలి బరిలోకి దిగి అభిమానులను అలరించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళల డబుల్స్, మిక్స్డ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
ఈ మ్యాచ్ లను వీక్షించే అభిమానులు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర కనిష్టం రూ. 499, గరిష్టం రూ. 799 నిర్ణయించారు. పేటీఎంలో మ్యాచ్ టికెట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మ్యాచ్లలో సానియా మీర్జా రెండు మ్యాచ్లు ఆడుతుంది. మొదటిది సానియా – బోపన్న, ఇవాన్ డోడిగ్ – బెథానీ మాటెక్ – సాండ్స్ మధ్య మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్, రెండోది సానియా – బోపన్న, మరొకటి రోహన్ బోపన్న నేతృత్వలోని రెండు జట్ల మధ్య రౌండర్ల మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు తిలకించి సానియాకు గ్రాండ్ వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిసింది. సానియాతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న ఫరాఖాన్ కూడా టెన్నిస్ స్టార్ చివరి మ్యాచ్ను తిలకించేందుకు హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.