Prithvi Shaw Sapna Gill Selfie Row: పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ పేర్కొన్నారు. అతడిని డబ్బులు డిమాండ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి చేసిన కేసులో అరెస్టయిన సప్నా గిల్ను శుక్రవారం అంధేరి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆమెకు ఫిబ్రవరి 20 వరకు పోలీసు కస్టడీ విధించింది.
పృథ్వీ షాకు మద్యం అలవాటు
“పృథ్వీ షాను నా స్నేహితుడు శోబిత్ ఠాకూర్ సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా క్రికెటర్ అని కూడా నాకు తెలియదు. మేము ఇద్దరే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు అతని ఎనిమిది మంది స్నేహితులు ఉన్నార”ని సప్నా గిల్ కోర్టుకు తెలిపారు. కోర్టులో సప్నా గిల్ తరపున ఆమె న్యాయవాది వాదనలు వినిపించారు. పృథ్వీ షాకు మద్యం అలవాటు ఉందని, అందుకే బీసీసీఐ అతనిపై నిషేధం విధించిందని మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కోర్టులో ప్రస్తావించారు. “కేసును క్లోజ్ చేయడానికి సప్న 50 వేల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఘటన జరిగిన 15 గంటల తర్వాత పృథ్వీ షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేద”ని ప్రశ్నించారు.
Also Read: ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి చేసిన నటి అరెస్ట్..
బెయిల్ కోసం అప్పీల్ చేస్తాం
తన క్లైంట్ పై పృథ్వీ షా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సప్నా గిల్ తరపు లాయర్.. కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ అన్నారు. “పృథ్వీ షా చేసిన ఆరోపణలన్నీ తప్పని మేము ఈ రోజు కోర్టులో వాదించాం. సప్నాకు విధించిన పోలీసు కస్టడీని తొలగించాలని తదుపురి విచారణలో కోరతాం. బెయిల్ కోసం అప్పీల్ చేస్తాం. పోలీసులు ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 387 కూడా చేర్చార”ని చెప్పారు.
అసలేం జరిగింది?
సెల్ఫీలు తీసుకోవడానికి నిరాకరించారనే అక్కసుతో పృథ్వీ షాపై కారుపై బేస్ బాల్ బ్యాట్తో దాడి చేశారని సప్నా గిల్, శోబిత్ ఠాకూర్ పై ఆశిష్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో ఓషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలోని హోటల్ వెలుపల బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తనను చంపుతామని బెదిరించారని ఆశిష్ యాదవ్ తెలపడంలో ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 387 కూడా జోడించినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 143, 148, 384, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.