Sri Lanka President thanks Pakistan PM for agreeing to play India in T20 World Cup 2026
T20 World Cup 2026 : ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం దిగివచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇచ్చింది. సోమవారం రాత్రి ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు శ్రీలంక అధ్యక్షడు అనుర కుమార దిస్సానాయక ధన్యవాదాలు తెలియజేశాడు. తాము చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమం చేసినందుకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.
‘మనందరం ఎంతో ఇష్టపడే ఆట (భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్)కొనసాగేలా చూస్తున్నందుకు పాక్ ప్రధానమంత్రికి ధన్యవాదాలు. షెడ్యూల్ ప్రకారం కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనున్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరగనుందని తెలిసి సంతోషంగా ఉంది. ఇక ఈ మెగాటోర్నీకి సహ ఆతిథ్య దేశంగా.. ఐసీసీ చేసిన ప్రయత్నాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాలు చూపుతూ ఇతర దేశాలు శ్రీలంకలో ఆడేందుకు దూరంగా ఉన్న సమయంలో భారత్, పాక్ జట్లు కొలంబోలో ఆడడం ద్వారా చూపించిన సంఘీభావాన్ని శ్రీలంక ఎన్నటికి మరిచిపోదు.’ అని అనుర కుమార దిస్సానాయక అన్నారు.
Thank you Prime Minister @CMShehbaz for ensuring the game we all love goes on. Delighted that the eagerly awaited India and Pakistan match at the ongoing T20 Cricket World Cup in Colombo will proceed as planned.
As co-host of the tournament, Sri Lanka thanks the @ICC and all…
— Anura Kumara Dissanayake (@anuradisanayake) February 9, 2026
సోమవారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు కూడా అనుర కుమార దిస్సానాయక పాక్ ప్రధానికి ఫోన్ చేసి.. భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. భారత్తో పాక్ జట్టు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తుందన్నారు. అంతేకాకుండా దేశ పర్యాటక రంగం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుందన్నారు.