బెంగళూరులో తొక్కిసలాట ఘటనపై విచారణలో పాల్గొనాలని ఆర్సీబీతో పాటు పోలీస్ కమిషనర్ బి.దయానంద్కు నోటీసులు జారీ చేస్తామని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి.జగదీశ్ తెలిపారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై జగదీశ్ ఆధ్వర్యంలోనే మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోంది. తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
Also Read: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేదు.. కానీ, వారు కుటుంబాన్ని మాత్రం…: మద్రాసు హైకోర్టు
తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి స్టేడియాన్ని జగదీశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియాన్ని సందర్శించాను. ఇక్కడ జరిగిన అన్ని ఘటనల గురించి తెలుసుకున్నాను. కొంతమందికి విచారణ కోసం నోటీసు జారీ చేస్తాను. విచారణను 15 రోజుల్లో పూర్తి చేస్తాను. కేఎస్సీఏ, ఆర్సీబీ నిర్వహణ, ఈవెంట్ మేనేజర్తో పాటు పోలీస్ కమిషనర్కు నోటీసు జారీ చేస్తాను” అని అన్నారు.
కాగా, బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులోనూ విచారణ జరిగింది. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. మృతుల కుటుంబాలకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, ఆర్సీబీ కూడా రూ.10 లక్షల చొప్పున ప్రకటించింది.