T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..! తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) భారత్ వేదికగా జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published On : November 6, 2025 / 06:02 PM IST
T20 World Cup 2026 Ahmedabad likely to host final Reports
T20 World Cup 2026 : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 భారత్ వేదికగా జరగనుంది. కాగా.. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దేశంలో అతి పెద్ద గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు సమాచారం.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియాలు టీ20 ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు అన్ని శ్రీలంక వేదికగా జరగనున్నాయి. కొలంబో, పల్లెకెలె వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ పాక్ జట్టు ఫైనల్ కు చేరుకుంటే కొలంబో ఆతిథ్యం ఇవ్వొచ్చు.
IND vs AUS 4th T20 : నాలుగో టీ20 మ్యాచ్లో ఆసీస్ పై ఘన విజయం.. 2-1 ఆధిక్యంలోకి భారత్
20 దేశాలు..
ఎన్నడూ లేని విధంగా ఈ సారి టీ20 ప్రపంచకప్లో ఏకంగా 20 దేశాలు బరిలోకి దిగనున్నాయి. గ్రూప్ స్టేజీలో వీటిని ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులు విభజించనున్నారు. ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. సూపర్-8కి అర్హత సాధించిన జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులు గా విడగొడతారు. ఆయా గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
2026 టీ20 ప్రపంచ కప్కు అర్హత సాధించిన 20 జట్లు ఇవే..
భారతదేశం, శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..?
టీ20 ప్రపంచకప్ వేదికలకు సంబంధించిన షార్ట్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కలేదు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు వైజాగ్లోని ఏసీ-వీడీసీఏ క్రికెట్ స్టేడియాలలో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ను కేటాయించలేదు. దీనిపై తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్లను కేటాయించాలని కోరుతున్నారు. మరో వారం, పది రోజుల్లో షెడ్యూల్కు సంబంధించి ఐసీసీ అఫిషియల్గా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
