T20 World Cup 2026 Suryakumar Yadav comments after India Beat Zimbabwe
IND vs ZIM : టీమ్ఇండియా బ్యాటర్ల పై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేదన్నాడు. గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగు అయ్యాయి. మార్చి 1న వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీస్లో అడుగుపెడుతుంది.
అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55 పరుగులు ), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50నాటౌట్ ) మెరుపు హాఫ్ సెంచరీలు చేయగా, తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 33 పరుగులు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38 పరుగులు) దంచికొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
అనంతరం 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితం అయింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. సికిందర్ రజా (31 ;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె లు తలా ఓ వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గెలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో ఓటమిని మరిచి ఈ మ్యాచ్కు సన్నద్ధం అయినట్లు చెప్పుకొచ్చాడు. ‘నిజం చెప్పాలంటే.. గత మ్యాచ్తో పాటు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల జ్ఞాపకాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని అనుకున్నాం. మా వీడియో విశ్లేషకుడు బ్యాటర్లు, బౌలర్ల కోసం ఒక ప్రత్యేక స్లైడ్ను సిద్ధం చేశాడు. అందులో గత సంవత్సరం మేం ఎంత బాగా రాణించామో చూపించాడు. దీంతో సానుకూల మైండ్ సెట్తో బరిలోకి దిగాము .’అని సూర్య తెలిపాడు.
జింబాబ్వేతో మ్యాచ్లో టాప్ ఆర్డర్ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు అందరూ రాణించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అయితే.. బౌలింగ్ విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సి ఉందన్నాడు. ఈ మ్యాచ్ విజయాన్ని స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగుతామన్నాడు. వెస్టిండీస్తో మ్యాచ్ సమయానికి లోపాలను సరిదిద్దుకుంటామన్నాడు.
జింబాబ్వే బ్యాటర్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా వారి ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నాడు. వారు ఇన్నింగ్స్ నిర్మించిన తీరు ఆకట్టుకుందన్నాడు. పవర్ ప్లేలో కాస్త సమయాన్ని తీసుకున్నారని, అయితే.. ఆ తరువాత చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారన్నాడు. మొత్తంగా వారి బ్యాటింగ్ తీరు ఆకట్టుకుందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా భారత బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్గా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఇక వెస్టిండీస్తో మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదన్నాడు. కోల్కతా చేరుకున్న తరువాత ఆ మ్యాచ్ గురించి ఆలోచిస్తామని అన్నాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకుని మరింత తాజాగా మ్యాచ్కు సిద్ధం అవుతామన్నాడు.