T20 World Cup 2026 What happen if IND vs ENG Semis washed out due to rain
IND vs ENG : టీ20 ప్రపంచకప్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం (ఫిబ్రవరి 5) ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. కాగా.. ఆదివారం (మార్చి 8న) జరగనున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడేది ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో పలు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటి? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాచ్ రద్దు అయితే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటుందనే ఆసక్తి నెలకొంది. మరి ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ సారి చూద్దాం..
* సాధారణంగా వర్షం అంతరాయం కలిగించిన సందర్భాల్లో ఓవర్లు కుదించి మ్యాచ్లను నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే.. టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజీలో ఫలితం తేలేందుకు ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్లు అయినా ఆడాల్సి ఉంటుంది. కానీ నాకౌట్ మ్యాచ్ల్లో ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాలని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి.
* గ్రూప్, సూపర్-8 దశలోని మ్యాచ్లకు ఐసీసీ ఎలాంటి రిజర్వ్ డేలను కేటాయించలేదు. కానీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేలను కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ను నిర్వహించలేని పరిస్థితుల్లో మరుసటి రోజు మ్యాచ్ను నిర్వహించవచ్చు.
* నాకౌట్ మ్యాచ్ల్లో వర్షం అంతరాయం కారణంగా నిర్ణీత సమయంలోగా మ్యాచ్ పూర్తి కానీ పక్షంలో అదనంగా 90 నిమిషాల సమయం ఉంటుంది. ఈ సమయంలో కూడా మ్యాచ్ నిర్వహించడానికి అవకాశం లేకపోతే రిజర్వ్ డేలో మ్యాచ్ను నిర్వహిస్తారు. అయితే.. ముందు రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్ రిజర్వ్ డే రోజున మొదలు కానుంది.
మ్యాచ్ రద్దైతే..
షెడ్యూల్ రోజుతో పాటు రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ను నిర్వహించలేని పరిస్థితుల్లో మాత్రమే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తారు. ఇలా మ్యాచ్ ను రద్దు చేసిన పక్షంలో సూపర్-8లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది.
సూపర్-8లో గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు చేరుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. గ్రూప్-1లో రెండో స్థానంతో సెమీస్లో అడుగుపెట్టింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకుంటుంది. భారత్ ఇంటి ముఖం పడుతుంది.