IND vs AUS : పెర్త్ టెస్టు.. చేతులెత్తేసిన బ్యాటర్లు.. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 ఆలౌట్..
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు.
- Thota Vamshi Kumar
- Published On : November 22, 2024 / 12:44 PM IST
Team India 150 all out in first innings in perth test
IND vs AUS : పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) లు ఫర్వాలేదనిపించారు.
మిగిలిన వారిలో ధ్రువ్ జురెల్ (11) ఒక్కడే రెండు అంకెల స్కోరు చేయగా అంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమకు అచ్చొచ్చిన కండిషన్స్లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరుకున్నారు. ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు కోహ్లీ సైతం 5 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్కు చేరుకోగా ధ్రువ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4)లు విఫలం అయ్యారు. దీంతో భారత్ 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
IND vs AUS : కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? థర్డ్ అంపైర్ నిర్ణయం పై మండిపడుతున్న నెటిజన్లు..
ఈ దశలో సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్తో కలిసి తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న నితీశ్ రెడ్డి ఆదుకున్నాడు. వీరిద్దరు ఏడో వికెట్ 48 పరుగులు జోడించి జట్టును స్కోరు వంద పరుగులు ధాటించారు. పంత్ ఔటైన తరువాత జట్టు ఆలౌట్ కావడానికి ఎంతో సేపు పట్టలేదు.
