IPL 2023: అందుకే ప్రేక్షకులంతా కేకేఆర్ జెర్సీతో కాకుండా సీఎస్కే జెర్సీతో నా కోసం వచ్చారు: ధోనీ
IPL 2023: మ్యాచ్ ను చూసేందుకు కోల్ కతాకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అత్యధిక మంది కోల్కతా నైట్రైడర్స్ జెర్సీతో కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో వచ్చారు. ఎందుకలా చేశారో ధోనీ చెప్పాడు.
- T Venkateshwarlu
- Published On : April 24, 2023 / 04:53 PM IST
IPL 2023
IPL 2023: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తనకు ప్రేక్షకులు ఫేర్వెల్ ఇవ్వడానికి ప్రయత్నించారని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అంతేకాదు, అత్యధిక మంది కోల్కతా నైట్రైడర్స్ జెర్సీతో కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో వచ్చారు. ధోనీ కోసమే వారంతా పసుపు రంగు జెర్సీ వేసుకొచ్చారు. వచ్చే ఐపీఎల్ లో ధోనీ ఆడతాడా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వస్తున్నాయి.
దీంతో నిన్న ధోనీని చూసేందుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు భారీగా వచ్చారు. సొంత జట్టు కోల్కతా నైట్రైడర్స్ జెర్సీ ధరించకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని వారు ధరించడం గమనార్హం. దీనిపై ధోనీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “నాకు వచ్చిన మద్దతు పట్ల కృతజ్ఞతలు చెబుతున్నాను. చాలా మంది వచ్చారు.
వారు తదుపరి ఈడెన్ గార్డెన్స్ కు కేకేఆర్ జెర్సీతో వస్తారు. తాజాగా జరిగిన మ్యాచులో నాకు ఫేర్ వెల్ ఇవ్వడానికి ప్రయత్నించారు. వారందరికీ కృతజ్ఞతలు” అని ధోనీ వ్యాఖ్యానించాడు. కాగా, ఆదివారం జరిగిన మ్యాచులో గెలవడంతో ధోనీ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్-1కు ధోనీ టీమ్.. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఆర్సీబీ బ్యాటర్
