Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. చరిత్రలో తొలిసారి

పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినాబెన్‌ పటేల్‌ అద్భుతంగా ఆడి చివరకు భారత్‌కు రజత పతకాన్ని అందించింది.

Bhavina

Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినాబెన్‌ పటేల్‌ అద్భుతంగా ఆడి చివరకు భారత్‌కు రజత పతకాన్ని అందించింది. మహిళల సింగిల్స్‌లో 34 ఏళ్ల భవిన ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకోగా.. గోల్డ్ మెడల్ మాత్రం సాధించలేకపోయింది. టేబుల్ టెన్నిస్ విభాగంలో చైనాకు చెందిన యింగ్ జౌతో తలబడిన భవినా ఓడిపోయి గోల్డ్ మెడల్ మిస్ అయ్యింది. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఇది మొదటి పతకం. టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారతదేశానికి ఇదే మొదటి పతకం.

గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో జన్మించిన భావినా పటేల్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశారు. టోక్యో పారాలింపిక్ క్రీడలలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న హస్ముఖ్ భాయ్ పటేల్ కుమార్తె భవినా పటేల్ రజత పతకం సాధించింది. ఆమె బంగారు పతకం సాధిస్తుంది అని అందరూ నమ్మకం ఉంచారు.

టోక్యో పారాలింపిక్ క్రీడల ఫైనల్‌లో వీల్‌చైర్‌పై ఆడుతున్న భావినా పటేల్ 11-7 తేడాతో మొదటి గేమ్‌లో ఓడిపోయింది. రెండవ గేమ్‌లో 11-5 తేడాతో ఓడిపోయింది, ఆపై మూడవ గేమ్‌లో ఆమె 11-6 తేడాతో ఓడిపోయింది మరియు బంగారు పతకం సాధించాలనే ఆమె కల నెరవేరలేదు. సెమీ-ఫైనల్స్‌లో కూడా, ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోపై విజయం సాధించారు.