Virat Kohli : రోహిత్ శర్మ బాటలో విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ టూర్కు ముందే ప్రకటించే చాన్స్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం..
- Harish Thanniru
- Updated on- May 11, 2025 / 09:06 AM IST
Virat Kohli
Virat Kohli Test retirement: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. రోహిత్ బాటలో పయణించేందుకు మరో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సిద్ధమైనట్లు సమాచారం. భారత్ జట్టు ఇంగ్లాండ్ టూర్ కంటే ముందే విరాట్ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం.
జూన్ లో ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా వెళ్లనుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తరువాత జట్టు సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. రోహిత్ వారసుడిగా కేఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్, శుభమన్ గిల్ పేర్లతోపాటు విరాట్ కోహ్లీ పేరుకూడా వినిపిస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం ఇంగ్లాండ్ టూర్ కు ముందే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని బోర్డు ఉన్నత స్థాయి అధికారి ఒకరు కోహ్లీకి విజ్ఞప్తి చేశారట. కోహ్లీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించాల్సి ఉంది. జట్టు ప్రకటన తరువాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? బీసీసీఐ సూచన మేరకు ఇంగ్లాండ్ టూర్ లో తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
