Virat Kohli Retirement : టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బార్బడోస్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. సఫారీ జట్టుపై రోహిత్ సేన 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
Read Also : SA vs IND T20 WC : విశ్వవిజేతగా భారత్.. 17ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ సొంతం!
ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నిలిచిన కోహ్లి, రాబోయే తరం బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు.
ఇదే నా చివరి టీ20 ప్రపంచ కప్ :
ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగిన ఢిల్లీ కుర్రాడిగా కోహ్లీ కెప్టెన్గా T20I కెరీర్లో అద్భుతమైన విజయాలు, పరాజయాలను చవిచూశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 మ్యాచ్ అని విరాట్ స్పష్టం చేశాడు. “ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్.. మేము సాధించాలనుకున్నది ఇదే. ఈ ప్రపంచ కప్ గెలిచి రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నా.
ఐసీసీ టోర్నీ గెలిచేందుకు సుదీర్ఘ కాలంగా ఎదురుచూశాం. ఎలాగైనా ప్రపంచ కప్పును ఎత్తాలనుకుంటున్నాం. మీరు రోహిత్ (శర్మ) లాంటి వ్యక్తిని చూస్తారు. అతను 9 టీ20 ప్రపంచ కప్లు ఆడాడు. ఇది నాకు ఆరవది. ఈ ప్రపంచ కప్ విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగాలను నిలువరించడం చాలా కష్టంగా ఉంది. అద్భుతమైన రోజు” అని కోహ్లీ తెలిపాడు.
The man of golden heart. ❤️ #viratkohli pic.twitter.com/p9rrMD7pnP
— Prayag (@theprayagtiwari) June 29, 2024
ప్రస్తుతం వన్డే, టీ20 ప్రపంచకప్లు గెలిచిన అరుదైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. కోహ్లి 2010లో తన మొదటి అంతర్జాతీయ టీ20 ఆడాడు. ఆ తర్వాత అనేక టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడాడు. తన అద్భుతమైన కెరీర్ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ ఆడిన మొత్తం 125 మ్యాచ్లలో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ నమోదు చేయగా, 38 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Also : T20 World Cup Final : జయహో భారత్.. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..