Virat Kohli
Virat Kohli : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) విధించిన షరతు కారణంగా ఈసారి విజయ్ హజారే ట్రోఫీకి కళ సంతరించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేని సమయంలో భారత ఆటగాళ్లు కనీసం రెండు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ నిబంధన విధించింది. దీంతో భారత జట్టులోని రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతోసహా ప్రతిఒక్కరూ ఆయా రాష్ట్రాల జట్ల తరపున విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మైదానంలో అడుగుపెట్టారు. బ్యాటుతో పరుగుల వరద పారించడంతోపాటు.. బంతితోనూ అదరగొట్టారు.. ఫలితంగా క్రికెట్ అభిమానుల చూపు ట్రోఫి వైపు మళ్లింది.
Also Read : Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం.. 24 బంతులు ఆడితే 10 సిక్సర్లే..
విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగగా.. రోహిత్ శర్మ ముంబయి జట్టు తరపున ఆడాడు. వీరిద్దరూ తమతమ జట్ల తరపున చెరో రెండు మ్యాచ్లు ఆడారు.. సెంచరీల మోత మోగించారు. వీరి ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు మైదానంకు భారీగా తరలివచ్చారు. అయితే, కోహ్లీ రైల్వేస్తో మరో మ్యాచ్ (మూడో మ్యాచ్) ఆడతాడని వార్తలు వచ్చాయి. దీంతో కోహ్లీని మరోసారి డొమెస్టిక్లో చూడొచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. విరాట్ కోహ్లీ రైల్వేస్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెప్పింది. కానీ, విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ కోచ్ సరన్దీప్ సింగ్ వెల్లడించారు. త్వరలో న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్కు సన్నాహకంగానే అతను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో కోహ్లీ ఈ మ్యాచ్కు దూరమవడంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
విజయ్ హజారే టోర్నీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లి.. అద్భుత ప్రదర్శన చేశాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో (131) సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 77 పరుగులతో రాణించాడు.
న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డే మ్యాచ్ లు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈనెల 11 నుంచి జరిగే మూడు వన్డే మ్యాచ్ ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు.