Lionel Messi : మెస్సీని ఇండియాకు రప్పించిన శతద్రు ఎవరు?
మెస్సీని (Lionel Messi ) భారత పర్యటనకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శతద్రు దత్తా.
- Thota Vamshi Kumar
- Published On : December 13, 2025 / 08:42 AM IST
Who is Satadru Dutta Man behind Lionel Messi GOAT Tour 2025
Lionel Messi : హైదరాబాద్లో మెస్సీ మేనియా పీక్స్కు చేరింది. అభిమాన ఆటగాడు కళ్లు ముందు కనిపించబోతున్నాడు, ఆడబోతున్నాడనే ఊహే.. అభిమానులను ఉత్సాహానికి బ్రేకుల్లేకుండా చేస్తోంది. మరి హైదరాబాద్లో మ్యాచ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు. అసలు మెస్సీ భారత్ టూర్ వెనక కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఎవరు.. అంత బిజీ ఆటగాడిని ఇండియాకు రప్పించింది ఎవరు. అన్నది ఇప్పుడు చూద్దాం..
మెస్సీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. సీఎం రేవంత్ టీమ్ RR 9 జెర్సీ ధరించనుండగా మెస్సీ LM 10 జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ది గోట్ ఇండియా టూర్ అనే ట్యాగ్లైన్ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు రంగాల్లోని సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు సీఎం రేవంత్రెడ్డి, మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. తర్వాత యువ ఆటగాళ్లతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్లు హాట్కేకుల్లో సేల్ అవుతున్నాయ్. 17వందల 50 రూపాయల నుంచి 30వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు.
2 వేల మందితో బందోబస్తు
మెస్సీ టూర్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు పెట్టారు. అదనంగా స్టేడియం లోపల వెయ్యి మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్టేడియంను భద్రతా అవసరాలకు అనుగుణంగా నాలుగు సెక్టార్లుగా విభజించామని చెప్పారు. 39వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇక శంషాబాద్ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు మెస్సీ ప్రయాణించే మార్గాలను ఫైనల్ చేశారు. ఇక అటు ఉప్పల్ మ్యాచ్కు టికెట్లు, పాస్లు ఉన్నవారు మాత్రమే.. స్టేడియం దగ్గరకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని కోరారు. ఇదంతా ఎలా ఉన్నా.. మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్కు.. సీఎం రేవంత్ కొద్దిరోజుగా భారీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
మెస్సిని రప్పించిన ఘనత శతద్రు దత్తాదే..
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు లియోనెల్ మెస్సి. అలాంటి దిగ్గజ ఆటగాడు రెండోసారి భారత్కు రాబోతున్నాడంటే.. ఫ్యాన్స్ సంబరం మాములుగా ఉంటుందా ! అదే కనిపిస్తోంది ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా మెస్సీ భారత్లో అడుగు పెడుతున్నాడు. తనను నేరుగా చూసే అవకాశం కోసం దేశవ్యాప్తంగా సాకర్ ప్రియులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ పర్యటనకు మెస్సిని రప్పించిన ఘనత ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించారు.. ఆయనే శతద్రు దత్తా. మెస్సి కంటే ముందు బ్రెజిల్ దిగ్గజం పీలేను, అర్జెంటీనా గ్రేట్ డీగో మారడోనాను భారత్కు తీసుకొచ్చింది కూడా అతనే.
మెస్సిని రప్పించడానికి శతద్రు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శతద్రు దత్తా ఇనిషియేటివ్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన ఆయన.. స్పోర్ట్స్ మార్కెటింగ్, సెలబ్రెటీ మేనేజ్మెంట్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టాడు. కోల్కతా సహా కొన్ని నగరాల్లో ఫుట్బాల్కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఆటలో దిగ్గజాలను భారత్కు రప్పించడంపై దృష్టిపెట్టాడు. 2015లో పీలేను కోల్కతాకు తీసుకువచ్చాడు.
ఆ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరు కావడంతో అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. తర్వాత మారడోనా, రొనాల్డినో, ఎమి మార్టినెజ్ లాంటి స్టార్లతోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు శతద్రు. 2022లో అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచకప్ గెలవడం, ఆ విజయంలో మెస్సి కీలకపాత్ర పోషించడంతో ప్రపంచవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. దీంతో అతణ్ని భారత్కు రప్పిస్తే గత ఈవెంట్లు అన్నింటినీ మించిన స్పందన వస్తుందని.. అది భారత్లో ఫుట్బాల్ ఆదరణకూ తోడ్పడుతుందని భావించాడు శతద్రు. రెండేళ్ల పాటు ఇందుకోసం అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
మెస్సి ఏజెంట్ అయిన అతడి తండ్రితో.. ముందుగా సంప్రదింపులు జరిపాడు శతద్రు. చాలా ప్రయత్నాల తర్వాత.. భారత్లో మూడు రోజుల పర్యటనకు మెస్సీ అంగీకరించాడు. ఇదంతా ఎలాఉన్నా.. మెస్సీ రాక తర్వాత.. భారత్లో ఫుట్బాల్కు మరింత క్రేజ్ రావడం ఖాయం. సాకర్ అంటే.. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు పరిమితం. మెస్సీ పర్యటన.. ఈ క్రేజ్ను దేశవ్యాప్తంగా చేసే అవకాశం ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
