India tour of West Indies Rescheduled : ఈ నెలాఖరులో వెస్టిండీస్(West Indies ) పర్యటనకు టీమ్ఇండియా(Team India) వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూన్ 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్తో పర్యటన ఆరంభం కానుంది. అయితే.. ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడుతోంది.
ఈ ఏడాదిలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో వెస్టిండీస్ పాల్గొనాలంటే ఈ క్వాలిఫయర్స్ టోర్నీలో ఖచ్చితంగా ఫైనల్స్కు చేరాల్సి ఉంటుంది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో 39 పరుగులతో విండీస్ విజయం సాధించింది. తన తరువాతి మ్యాచ్లను జూన్ 22న నేపాల్తో 24న జింజాబ్వే, 26న నెదర్లాండ్స్తో వెస్టిండీస్ ఆడాల్సి ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగి విండీస్ సూపర్ సిక్స్ దశలో అడుగుపెడితే జూలై 7 వరకు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ మ్యాచ్ జూలై 9న ఉంది. ఒకవేళ విండీస్ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే భారత్తో సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమే.
వాస్తవానికి విండీస్ జట్టు వన్డేలకు, టెస్టులకు వేరు వేరు జట్లను ఆడిస్తోంది. అయితే.. జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రోస్టన్ చేజ్, అల్జారీ జోసెఫ్ వంటి ఆటగాళ్లు మాత్రం రెండు ఫార్మాట్లలో ఆడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది అంతా వీరి గురించే. ప్రస్తుతం వీరు క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆడి వారు స్వదేశానికి వచ్చేందుకు దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్లు క్రిక్బజ్ తన నివేదికలో తెలిపింది.
ICC Test Rankings : టాప్-10 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. విరాట్ కోహ్లి ర్యాంక్ ఎంతంటే..?
కాగా.. దీని గురించి ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతినిధులు మాట్లాడారు. ప్రపంచ కప్ క్వాలిఫయర్ ఫైనల్స్ కు చేరడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యమని అన్నారు. ఫైనల్లో ఓడినా, గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. ఫైనల్ చేరిన వెంటనే ప్రధాన ఆటగాళ్లను స్వదేశానికి పిలవాలని బావిస్తున్నట్లు తెలిపారు.