×
Ad

RCB : చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. స్మృతి, వోల్ వీర విధ్వంసం.. WPL 2026 విజేత‌గా మరోసారి.. ఢిల్లీపై ఘన విజయం

RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 ఛాంపియన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది.

RCB

  • డబ్ల్యూపీఎల్ -2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ
  • ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం
  • స్మృతి మంధాన, వోల్ వీర విధ్వంసం
  • టైటిల్ పోరులో మరోసారి ఢిల్లీకి తప్పని నిరాశ 

RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 ఛాంపియన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. ఐదు మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే ప్లేఆఫ్స్ చేరి నేరుగా ఫైనల్‌కూ అర్హత పొందిన ఆర్సీబీ జట్టు.. ఫైనల్లో ఢిల్లీని ఓడించి డబ్ల్యూపీఎల్ -2026 ట్రోఫీని గెలుచుకుంది. తద్వారా రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని సాధించి ముంబై ఇండియన్స్ జట్టు సరసన నిలిచింది.

Also Read : WPL 2026 : డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్.. ఎల్లీస్ పెర్రీ రికార్డు పై స్మృతి మంధాన క‌న్ను.. ఏకైక ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌గా

డబ్ల్యూపీఎల్ -2026 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57), లౌరా వోల్‌వార్ట్ (44) రాణించగా.. చివరిలో షినెల్ హెన్రీ (15బంతుల్లో 35 పరుగులు) చెలరేగింది.


భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. ఆర్సీబీ జట్టు ఆరంభంలోనే హిట్టర్ గ్రేస్ హారిస్ (9) వికెట్ కోల్పోయినా.. స్మృతి మందాన, జార్జియా వోల్‌‌లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఏ బౌలర్ ను వదలకుండా బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వోల్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మందాన 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ తో ఆర్సీబీ జట్టు 12 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్లు మాత్రమే కోల్పోయి 124 పరుగులు చేసింది.


అయితే, 17వ ఓవర్లలో వోల్ (79) ఔట్ కాగా.. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిచా(6) కూడా వెంటనే ఔట్ అయింది. కొద్దిసేపటికే స్మృతి మంధాన (87) కూడా పెవిలియన్ బాటపట్టింది. దీంతో చివరిలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 19వ ఓవర్లో, స్మృతి ఔటైన వెంటనే, రాధ ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్‌ను మిన్ను మణి జారవిడిచి ఉండకపోతే మ్యాచ్‌ ఫలితం భిన్నంగా ఉండేదేమో. ఆ తప్పిదానికి రెండు పరుగులు కూడా వచ్చాయి. చివరికి రెండు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరు జట్టు 204 పరుగులు చేసి డబ్ల్యూపీఎల్ -2026 విజేతగా నిలిచింది.

ఇదిలాఉంటే.. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అతిపెద్ద ఛేదన. గత రికార్డు కూడా ఆర్సీబీ (గుజరాత్‌పై 202)దే కావడం గమనార్హం.