Kia India Price Hike : ప్రముఖ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ అనుబంధ సంస్థ కియా ఇండియా కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. వచ్చే ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కియా మోడల్ కార్లలో ప్రధానంగా సెల్టోస్, సోనెట్, కారెన్స్తో సహా అన్ని మాస్ మోడళ్లపై 3 శాతం వరకు గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వస్తువుల ధరలు, సంబంధిత సరఫరా గొలుసు ఖర్చుల పెరుగుదలతో కార్ల ధరలను పెంచాల్సి వస్తుందని తెలిపింది. ఇప్పటికే చాలావరకూ కార్ల తయారీదారులు సంవత్సరం ప్రారంభంలో ధరల పెంపును ప్రకటించాయి. ఈ సంవత్సరంలో కియా మొదటిసారిగా కార్ల ధరల పెంపును ప్రకటించింది.
నిత్యావసర వస్తువుల ధరలు, మారకపు రేట్లు, ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల పాక్షిక ధరల పెంపు అవసరమని కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వివరించారు. అయినప్పటికీ కియా కస్టమర్లు ఆర్థిక భారం లేకుండా కియా కార్లను కొనుగోలు చేయొచ్చునని పేర్కొన్నారు. భారత మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి కియా దేశీయ, విదేశీ మార్కెట్లలో కలిపి దాదాపు 1.16 మిలియన్ యూనిట్ల అమ్మకాలను సాధించింది.
స్టాండ్అవుట్ మోడళ్లలో సెల్టోస్ 6,13,000 యూనిట్లకు పైగా విక్రయించగా.. సోనెట్ మోడల్ 3,95,000 యూనిట్లు, కారెన్స్ 1,59,000 యూనిట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. గత నెలలో, కియా ఇండియా లైనప్లో మొత్తం 20,200 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. ఇందులో కియా సోనెట్ 9,102 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా అవతరించింది. ఇక, సెల్టోస్ 6,265 యూనిట్లు, కారెన్స్ 4,832 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచాయి.