Mark Zuckerberg Apology : ‘తప్పు మాదే..’ మోదీ పోస్ట్ తొలగింపుపై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ క్షమాపణలు.. అసలేం జరిగిందంటే?

Mark Zuckerberg Apology : మోదీ వీడియో వివాదం దగ్గర నుంచి బాలల భద్రత విషయంలో మెటా చర్యలపై ఆ కంపెనీ సీఈఓ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసినట్టు స్థానిక మీడియా తెలిపింది.

Zuckerberg Apology

  • మోదీ పోస్ట్ డిలీట్.. చివరకు జుకర్‌బర్గ్ క్షమాపణలు
  • మోదీ వీడియో వివాదం నుంచి బాలల భద్రత వరకు
  • మెటా మోడరేషన్ ఫెయిల్.. బహిరంగంగా ఒప్పుకున్న మెటా సీఈఓ
  • జుకర్‌బర్గ్ సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే?

Mark Zuckerberg Apology :  ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్ట్‌ను తాత్కాలికంగా తొలగించినందుకు మెటా ప్లాట్‌ఫామ్స్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. బాలల లైంగిక వేధింపుల కంటెంట్, డీప్‌ఫేక్‌లు, కొన్ని రకాల పెయిడ్ కంటెంట్‌ను క్యాంపెయిన్ చేయడం వంటి సమస్యలతో సహా కంటెంట్ నియంత్రణలో భారీ వైఫల్యాలు ఉన్నాయని కంపెనీ అధికారులు అంగీకరించారు.
అయితే, మెటా ప్లాట్‌ఫామ్ భారత్‌కు క్షమాపణలు చెప్పినట్లు వచ్చిన వార్తలు మరోసారి సోషల్ మీడియా దిగ్గజాల బాధ్యతపై చర్చకు దారితీశాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్, డీప్‌ఫేక్‌లు, కంటెంట్ మోడరేషన్ లోపాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మెటా ప్రతినిధులు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో జుకర్‌బర్గ్ తరఫున క్షమాపణలు తెలియజేశారు. అయితే, దీనిపై మెటా నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

మోదీ వీడియో డిలీట్.. వివాదానికి కారణం ఇదే :
ఈ పరిణామాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేస్‌బుక్ వీడియో డిలీట్ చేయడం పెద్ద వివాదంగా మారింది. పరీక్షల వివాదాలు, పేపర్ లీక్‌లపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం వీడియోను ఫేస్‌బుక్ నుంచి కొన్ని గంటల పాటు తొలగించడాన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. మెటా మాత్రం ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, సాంకేతిక లోపం కారణంగా జరిగిన పొరపాటుగా వివరణ ఇచ్చింది.

Read Also : Madhavan-CM Vijay : ‘మంచి చేసినా విమర్శలు తప్పవు’.. తమిళ రాజకీయాలపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్

భారత్ డిమాండ్ ఏంటి? :
మోదీ వీడియో తొలగింపుపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసింది. 3 రోజుల్లోగా స్పందించకపోతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సోషల్ మీడియా సంస్థలకు లభించే చట్టపరమైన రక్షణను పునఃపరిశీలించే అవకాశం ఉందని హెచ్చరించింది.

అదే సమయంలో, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్‌లు వంటి ప్రమాదకర అంశాలను తొలగించేలా ప్లాట్‌ఫారమ్‌లు మరింత బాధ్యత వహించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

సోషల్ మీడియా సంస్థలకు కొత్త సవాల్ :
భారత్ ఇటీవలే కంటెంట్ నియంత్రణ నిబంధనలను కఠినతరం చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాల్సిందిగా సోషల్ మీడియా సంస్థలను ఇదివరకే ఆదేశించింది. కోట్లాది మంది వాడే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కేవలం టెక్నాలజీ సంస్థలు మాత్రమే కాదని, ప్రజల భద్రత, నమ్మకానికి బాధ్యత వహించే సంస్థలుగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించింది.