Shiva Balakrishna Case
HMDA Former Director : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నా కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఒక్కొక్కరుగా శివబాలకృష్ణ బినామీలు వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో శివబాలకృష్ణ బినామీలుగాఉన్న భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ లకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో వీరిని విచారించనుంది. హెచ్ఎండీఏ లో కంప్యూటర్ ఆపరేటర్ గా భరణిని పెట్టాడు. శివబాలకృష్ణకు పీఏగానూ భరణి వ్యవహరించాడు. ఎన్విస్ డిజైన్ స్టుడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహించేవాడు. ఈ కంపెనీ ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లే అవుట్ బిల్డింగ్ లకు అన్ని అనుమతులను బాలకృష్ణ జారీ చేసేవారు.
Also Read : HMDA Shiva Balakrishan: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
మరో బినామీ ప్రమోద్ కుమార్. అతనికి మీనాక్షి కన్ స్ట్రక్షన్ లో శివబాలకృష్ణ ఉద్యోగం ఇప్పించాడు. మీనాక్షిలో అన్ని పనులు చేయించేవాడు. మేనల్లుళ్లనే తన సైన్యంగా మలుచుకొని శివబాలకృష్ణ కోట్లు సంపాదించాడు. శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలను అతని సోదరుడు నవీన్ కుమార్ చూసేవాడు. మేనలుళ్లు భరత్, భరణితోపాటు స్నేహితుడు సత్యనారాయణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వీరినుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా బినామీలుగా ఉన్నవారిని ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.
Also Read : HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు
ఇదిలాఉంటే ఇప్పటికే బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్ కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది.