ACB Raids: ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. కీలక పత్రాలు స్వాధీనం..?
సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Updated on- April 26, 2025 / 10:34 AM IST
hariram
ACB Raids: తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. షేక్ పేటలోని హరిరాం ఇంట్లో.. నగరంలోని మరో 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రెండ్రోజుల క్రితం ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది..ఈ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఆ ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్య అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరి డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దెత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
