దీపాదాస్ మున్షీపై వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ నేతల డిమాండ్

ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే NVSS ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

addanki dayakar, madhu yashki demand nvss prabhakar apology

Addanki Dayakar: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని, తన వద్ద ఆధారాలున్నాయని ఎన్వీఎస్ఎస్ ఆరోపించారు. ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు.

ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు ఉంది..
దీపాదాస్ మున్షీపై NVSS ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దివాళాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. దీపాదాస్ మున్షీని బెంగాలీ కాళీమాతగా ఆయన వర్ణించారు. ”అవినీతి, అక్రమాలు, అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ బీజేపీ. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కి ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు ఉంది. ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేస్తున్నార”ని ఆరోపించారు.

క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు. దీపాదాస్ మున్షీపై వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ”దీపాదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలను ఎదుర్కొన్న నాయకురాలు. ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతలు భయపడిపోయి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నార”ని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.

Also Read: కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బు సంచులు మోస్తున్నారు- బాల్క సుమన్

పసలేని, పనికిరాని ఆరోపణలు
దీపాదాస్ మున్షీపై బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దీపాదాస్ మున్షీ నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలు. ఆమె తెలంగాణ ఇన్‌చార్జ్‌ గా ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో పసలేని, పనికిరాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరు. బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోము. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షికి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు