Gandhi Hospital: గాంధీ దవాఖాన మరో రికార్డ్.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు!
కరోనా సెకండ్ వేవ్ గత ఏడాది మీద మరింత ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన వైరస్ ఈ ఏడాదిలో ఒక్క ఇండియాలోనే వందల రెట్లు వేరియంట్ అయిందని నిపుణులు హెచ్చర్తిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సెకండ్ వేవ్ లో యువత మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
- Naresh Mannam
- Published On : May 13, 2021 / 11:04 AM IST
Another Record Of Gandhis Treatment 110 Year Old Man Who Conquered Corona
Gandhi Hospital: కరోనా సెకండ్ వేవ్ గత ఏడాది మీద మరింత ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన వైరస్ ఈ ఏడాదిలో ఒక్క ఇండియాలోనే వందల రెట్లు వేరియంట్ అయిందని నిపుణులు హెచ్చర్తిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సెకండ్ వేవ్ లో యువత మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎక్కువ శాతం మంది సునాయాసంగా వైరస్ ను జయించి కోలుకుంటే ఇప్పుడు ఆసుపత్రుల పాలవుతున్నారు. మొత్తంగా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సెకండ్ వేవ్ యువతని హడలెత్తిస్తుంటే ఓ 110 వృద్ధుడు మాత్రం కరోనాను జయించి చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్ గాంధీ దవాఖాన అంటేనే ఎన్నో అద్భుతాలకు, రికార్డులకు నెలవు. గత ఏడాది కరోనా సోకిన గర్భిణికి చికిత్స అందించి సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. ఆమె ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది. ఇదే అప్పుడు అద్భుతంగా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు మహమ్మారి ఇంత క్రూరంగా మారి విరుచుకుపడుతున్న సమయంలో కూడా ఇదే గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి మరో రికార్డు నెలకొల్పాడు. 110 సంవత్సరాల రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.
రామానంద తీర్థ ఓ అనాధ. కీసరలోని ఓ ఆశ్రమంలో ఆయన ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరే సమయంలో రామానంద తీర్థ ఆక్సిజన్ లెవెల్స్ 92 పాయింట్లుగా మాత్రమే ఉండడంతో అప్పటి నుంచీ ఆయనకు ఐసీయూ వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. ఐతే దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత రామానంద కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో బుధవారం ఆయనకు మరోసారి కరోనా పరీక్ష చేయగా రిపోర్టులో నెగెటివ్ వచ్చింది.
కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ వచ్చినా ఆయనను ఇప్పుడే డిశ్చార్జ్ చేయలేమని.. మరికొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతామని గాంధీ వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఆయనను ఏడవ అంతస్తులోని సాధారణ వార్డుకు తరలించగా కొద్దిరోజులు ఆయనను అక్కడే ఉంచి అబ్జర్వ్ చేయనున్నారు. కాగా, రామానంద తీర్థకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఆయన కరోనాను జయించగలిగాడని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా వయసు రీత్యా కొద్దిరోజులు ఆసుపత్రిలోనే బస ఏర్పాటు చేసినట్లుగా గాంధీ సిబ్బంది తెలిపారు.
