రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పైఎత్తులు. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు. డిసెంబర్ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.
రాజాసింగ్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమా?
ఇంతవరకు గులాబీ జెండా ఎగరని గడ్డ. కమలం అడ్డాగా మారిన ప్రాంతం. అదే గోశామహల్ నియోజకవర్గం. ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఈసారి హ్యాట్రిక్ విక్టరీ పక్కా అంటున్నారు. మరోవైపు కమలం కంచుకోటను కూల్చేస్తామంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిషోర్ బిలాల్ వ్యాస్. కమీషన్ల కింగ్ను ఓడించి గోశామహల్ గోస తీర్చుతామంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారావు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో గ్యారెంటీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ పోరులో నిలిచేదెవరు.. గెలిచెదెవరు.?
కమిషన్ల కింగ్ రాజాసింగ్ ఓటమి ఖాయం- నంద కిషోర్
కమిషన్ల కింగ్ రాజాసింగ్ ఓటమి ఖాయమైపోయిందని బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిషోర్ బిలాల్ వ్యాస్ అంటున్నారు. నియోజకవర్గంలో రాజాసింగ్ నయా పైసా అభివృద్ధి చేయకుండా గోశామహల్ను అనాథను చేశారని ఆరోపించారు. చిరు వ్యాపారులు పాన్ డబ్బా పెట్టుకున్నా.. జ్యూస్ పాయింట్ పెట్టుకున్నా డబ్బు వసూలు చేసిన ఘనుడు అంటూ విమర్శించారు. వ్యవస్థను సర్వనాశనం చేసిన రాజాసింగ్ను ఓడిచేందుకు గోశామహల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు నంద కిషోర్ బిలాల్ వ్యాస్.
Also Read : గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్ ఫైట్లో గెలుపెవరిది?
ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ విక్టరీ పక్కా- రాజాసింగ్
ఎవరెన్ని కుట్రలు చేసినా గోశామహల్లో తనదే హ్యాట్రిక్ విక్టరీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. హామీలతో కాదు.. చేసిన అభివృద్ధి పనులతో ప్రచారం చేస్తున్నానని అన్నారు. కమీషన్ల విమర్శల్ని రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. డబ్బులు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేనికైనా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. ధర్మాన్ని నిలబెట్టేందుకు తాను ఎక్కడి వరకైనా వెళ్లేందుకు రెడీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి రాజాసింగ్.
రాజాసింగ్ కమీషన్లకు కాలం చెల్లింది- సునీతా రావు
ఎమ్మెల్యే రాజాసింగ్ కమీషన్లకు కాలం చెల్లిందంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి సునీతా రావు. గోశామహల్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. అది కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను బెదిరిస్తున్న రాజాసింగ్కు ఓటేస్తారా.. ఆడబిడ్డకు ఓటేస్తారా అంటూ గోశామహల్ ఓటర్లను సునీతా రావు అభ్యర్థిస్తున్నారు.
Also Read : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు
ఓవైపు హీటెక్కించే విమర్శలు.. మరోవైపు హోరెత్తించేలా ప్రచారాలు.. ట్రయాంగిల్ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు. మరి గోశామహల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతుంది? ప్రజలు ఎవరికి పట్టం కడతారు? చూడాల్సిందే..