CM KCR : ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారు?- సీఎం కేసీఆర్

ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.

CM KCR On NTR Party

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలన్నా, మరింత అభివృద్ధి కావాలన్నా.. బీఆర్ఎస్ ను గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు.

సంగారెడ్డిలో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి అన్న కేసీఆర్.. బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమే అని స్పష్టం చేశారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ BRS అన్నారు. ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. 58ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామని వాపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.

Also Read : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

ఓటే మనకు వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఆలోచించి ఓటు వేయాలన్నారు. రైతుబంధు డబ్బులు దుబారా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.. రైతుబంధు ఉండాలంటే BRS గెలవాల్సిందే అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24గంటల కరెంట్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతాయి” అని కేసీఆర్ అన్నారు.

”మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాను. రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు రాదు. దళారుల రాజ్యం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గవర్నర్ వల్ల కాస్త లేట్ అయ్యింది. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తాం. సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ. నా జిల్లా. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ని ఓడగొట్టినా నేను ఏమీ అనలేదు.

24గంటల తాగునీరు వచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ. ఎంత సేపు మసీదులు తవ్వుదామా అని చూస్తుంటారు. ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళకి పని. సంగారెడ్డి హైదరాబాద్ లో అంతర్భాగం అవుతుంది. సంగారెడ్డికి మెట్రో వస్తే మీ దశ మారిపోతుంది.
మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చు. కారుని గుద్దినా, నా ఓట్లు నేనే గుద్దుకున్నా అన్న ఎమ్మెల్యే కావాలా? ఈ ఉద్యమ ద్రోహి మొదట BRS లోనే ఉండే.

ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశారు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం” అని హామీ ఇచ్చారు కేసీఆర్.

Also Read : రైతుబంధు పథకాన్ని నిలిపివేయొద్దు.. ఈసీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వినతి

ట్రెండింగ్ వార్తలు