Basavatarakam Hospital: ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు.. అమరావతిలో కొత్త బ్రాంచ్
హైదరాబాద్ నోవాటెల్లో బసవతారకం(Basavatarakam Hospital) ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
- V Santhosh Kumar
- Published on- June 22, 2026 / 09:58 PM IST
Basavatarakam Hospital silver jubilee celebrations were held on a grand scale at Novotel Hyderabad.
- బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.
- హాజరైన సీఎం చంద్రబాబు.
- అమరావతిలో కొత్త బ్రాంచ్.
Basavatarakam Hospital: హైదరాబాద్ హైటెక్స్ పరిధిలోని నోవాటెల్లో బసవతారకం(Basavatarakam Hospital) ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆసుపత్రి ఛైర్మన్, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అనుప్రియ పటేల్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పురందేశ్వరి దంపతులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
క్యాన్సర్ విజేతల అనుభవాలు.. ప్రముఖుల ప్రశంసలు:
ఈ వేడుకల్లో సినీ నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడి, ధైర్యంతో పోరాడి కోలుకున్న వీరు.. తమ వ్యక్తిగత అనుభవాలను, ఎదుర్కొన్న వేదనను వేదికపై పంచుకుని అందరిలో స్ఫూర్తి నింపారు. గత పాతికేళ్లుగా నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా బసవతారకం నిలిచిందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి వచ్చే ఎంతోమంది రోగులకు ఈ ఆసుపత్రి పునర్జన్మను ప్రసాదిస్తోందని ప్రముఖులు ప్రశంసించారు.
అమరావతిలో బసవతారకం.. మంత్రి సత్యకుమార్ భావోద్వేగం:
ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి, సోదరి కూడా క్యాన్సర్ బారిన పడ్డారని, ఆ వ్యాధి తెచ్చే వేదన ఎలాంటిదో తనకు వ్యక్తిగతంగా తెలుసని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని అమరావతిలో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకు చొరవ తీసుకుంటున్న హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణకు మంత్రి సత్యకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో రాబోయే ఈ బ్రాంచ్ ద్వారా ఏపీలోని పేద రోగులకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
