చంచల్ గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

Bhuma Akhilapriya released on bail from Chanchalguda jail : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. గత 18 రోజులుగా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అఖిలప్రియ ఇవాళ సాయంత్రం బెయిల్ పై విడుదలయ్యారు. అఖిలప్రియ జైలు నుంచి విడుదల అవుతుండటంతో ఆమె బంధువులు, అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్నారు.

శుక్రవారం ఆమెకు సికింద్రాబాద్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిన్‌‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని కోర్టు ఆమెకు సూచించింది.

ప్రవీణ్‌ సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలిగా ఉండగా ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ ఏ-3గా ఉన్నారు. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భార్గవ్‌ రామ్‌ పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.