BRS MLA Rajaiah-Sarpanch Navya: క్షమాపణలు చెప్పిన రాజయ్య.. ఎమ్మెల్యే, సర్పంచ్ నవ్య మధ్య సయోధ్య
రాజయ్య, నవ్య మీడియా సమావేశంలో మాట్లాడి పలు విషయాలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు చింతిస్తున్నానని రాజయ్య అన్నారు. మహిళలు వారి హక్కులను సాధించుకోవాలని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే వారిని క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : March 12, 2023 / 05:47 PM IST
BRS MLA Rajaiah-Sarpanch Navya
MLA Rajaiah-Sarpanch Navya:హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్షమాపణలు చెప్పారు. రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపణలు చేయడంతో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. రాజయ్య లాంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని నవ్య తాజాగా డిమాండ్ చేశారు.
దీంతో వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చొరవతీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం రాజయ్య, నవ్య మీడియా సమావేశంలో మాట్లాడి పలు విషయాలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు చింతిస్తున్నానని రాజయ్య అన్నారు. మహిళలు వారి హక్కులను సాధించుకోవాలని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే వారిని క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
గతంలో తాను పార్టీ ఆదేశిస్తూ డిప్యూటీ సీఎం పదవిని కూడా వదులుకున్నానని చెప్పారు. ఇప్పుడు తాను పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో, సర్పంచ్ నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని రాజయ్య తెలిపారు. పార్టీలో ఎవరికైనా సరే విలువలు ప్రధానమని నవ్య చెప్పారు. తాను ఎమ్మెల్యే రాజయ్య వల్లే సర్పంచ్ అయ్యానని తెలిపారు. అయితే, రాజకీయాల్లో వేధింపులు ఉండకూదని అన్నారు. పార్టీలో మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారిని గౌరవించాలని చెప్పారు. పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోబోనని హెచ్చరించారు. వేధించేవారి భరతం పడతానని అన్నారు.
