రూట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు.. గులాబీ నేతలకు కొత్త టెన్షన్!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకు ఓ రకంగా టెన్షన్ పట్టుకుంటోంది.

Brs party leaders tension over Hyderabad Hydra demolitions

Hyderabad Hydra demolitions: గులాబీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు రూట్ మార్చడంతో గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. రోజు రోజుకు హైడ్రా దూకుడు పెంచుతుండటం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది నేతలు ముందు జాగ్రత్తగా న్యాయస్థానం తలుపు తడుతున్నారు. మరి వీరికి కోర్టుల్లో ఊరట దక్కుతుందా?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకు ఓ రకంగా టెన్షన్ పట్టుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ పార్టీకి ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు టెన్షన్ పట్టించాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన పదిమంది శాసనసభ్యులు, పలువురు శాసనమండలి సభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం విలీనం అవుతుందంటూ రాజకీయంగా జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ.. రేవంత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గులాబీ నేతల్లో మరింత ఆందోళన రేపుతున్నాయి. తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం ఈ వ్యవహారం చుట్టే తిరుగుతోంది.

మరి కొంతమందికి నోటీసులు
చెరువులు, కుంటలు వంటి నీటి వనరులను కాపాడేందుకు, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒక సీనియర్ అధికారి రంగనాథ్‌ను ఇన్చార్జిగా నియమించింది. గత కొన్ని రోజులుగా దూకుడు పెంచిన హైడ్రా భూకబ్జాలపై కొరడా ఝళిపిస్తోంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌-కన్వెన్షన్‌తో పాటు 18 ప్రాంతాల్లో 166 కట్టడాలను నేలమట్టం చేసింది. మరి కొంతమందికి నోటీసులు జారీ చేసింది.

హైడ్రా టార్గెట్‌లో బీఆర్ఎస్ నేతలు?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలుగా చలామణి అవుతున్న ఎంతోమంది నేతలు హైడ్రా టార్గెట్‌లో ఉన్నారన్న చర్చ గులాబీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది. జన్వాడ సమీపంలోని ఫామ్‌హౌస్ చుట్టూ వివాదం ముదురుతోంది. ఈ ఫామ్‌హౌస్‌ను హైడ్రా కూల్చేస్తుందన్న ప్రచారంతో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రదీప్ రెడ్డి- కోర్టును ఆశ్రయించారు. దీంతో అన్ని అనుమతులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది.

అలర్ట్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలు కూడా సాగునీటి వనరుల బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీంతో ఎమ్మెల్యే పల్లా అలర్ట్ అయ్యారు. అన్ని అనుమతులతోనే తాను విద్యాసంస్థలు నిర్మించానని న్యాయస్థానం తలుపు తట్టారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి విద్యాసంస్థలు నడుపుతున్నానని.. గత 9 నెలలుగా ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు.

గులాబీ పార్టీ సీరియస్‌
ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ కూడా సీరియస్‌గా పరిగణిస్తోంది. రెండు మూడు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల విద్యాసంస్థలు అక్రమ నిర్మాణాలని వివాదం రేగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న గులాబీ పార్టీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఒత్తిళ్లకు తమ ఎమ్మెల్యేలు భయపడకపోవడంతో పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అన్ని అనుమతులతోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థల నిర్మాణం జరిగిందన్నారు.

అక్రమ నిర్మాణాల పేరుతో గులాబీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తే.. తాము కూడా అందుకు అనుగుణంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు