రేవంత్ రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా.. 8వ తేదీన చర్చ పెట్టుకుందాం.. : కేటీఆర్ ప్రతిసవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ అని కేటీఆర్ అన్నారు.

Revanth Reddy and KTR

KTR: రైతులకు ఎవరేం చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు.. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసింది ఎవరో అందరికీ తెలుసు.. తెలిసీ తెలియనట్టు నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు నేను రెడీ అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 70శాతం మంది రైతులే. వారికోసం 18నెలల్లో రైతు భరోసా, రైతు బీమా, గిట్టుబాటు ధర, పంట రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ తదితర పథకాల ద్వారా రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రైతు రాజ్యమని నిరూపించామని అన్నారు. రైతులకు అండగా నిలిచింది ఎవరో పార్లమెంట్లోనైనా, అసెంబ్లీలోనైనా చర్చ పెడదాం. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ ఎవరు చర్చకు వస్తారో రండి అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు.

కేటీఆర్ ప్రతిసవాల్..
కేసీఆర్‌ని ఎదుర్కునే సీన్ నీకు లేదు కానీ.. మేము నీకు చాలు. ఎక్కడికైనా వస్తాం. రేవంత్ రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్న. తెలంగాణ ప్రజలకు వ్యవసాయంలో ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ. 8వ తేదీన సోమాజికగూడ ప్రెస్‌క్లబ్ లో చర్చ పెట్టుకుందాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ కు రావాలని కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. ఎక్కడైనా చర్చకు మేము రెడీ. కానీ, ప్రిపేర్ కావడానికి సీఎం రేవంత్ రెడ్డికి 72గంటల సమయం ఇస్తున్నాను. రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి అయిన, కొడంగల్ అయిన, చింతమడక అయినా నేను రెడీ. తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్. చేతగాని రేవంత్ ప్రభుత్వం రైతులను కాల్చుకు తింటోంది. ఎరువులు కూడా ఇవవ్డం చేతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చర్చకు రమ్మంటావా..? రైతు బీమా ఎగ్గొట్టింది కాంగ్రెస్.. బనకచర్ల ద్వారా గురువు చంద్రబాబు నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తుంటే ఎలా సహకరిస్తున్నావో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ విమర్శించారు.

రైతు డిక్లరేషన్ లో ఒక్క హామీని అమలు చేయకుండా సిగ్గులేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దమ్ముంటే చర్చకు రా.. 8వ తేదీ ఉదయం 11గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం. 39వేల కోట్లు రైతు బంధు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు చెప్పుకుంటున్న రేవంత్ కు సిగ్గుండాలి అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.