CJI Justice NV Ramana : న్యాయవ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శం : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు.
- bheemraj
- Published On : June 2, 2022 / 07:05 PM IST
Cji Nv Ramana 11zon
CJI Justice NV Ramana : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల కింద అద్భుతమైన ఉద్యమం జరిగిందన్నారు. కొత్త రాష్ట్ర భవిష్యత్ పై గతంలో సందేహాలుండేవి..ఎనిమిదేళ్లలో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాని తెలిపారు. తెలంగాణలోని కొత్త జిల్లాల కోర్టులను ఇవాళ సీఎం కేసీఆర్ తో కలిసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలంగాణ హైకోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహణ పెరిగిందన్నారు.
సంక్షేమ పాలన అందించడం రాజ్యాంగం కల్పించిన బాధ్యత అన్నారు. రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి కూడా అవసరం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు కేసులు సత్వరం పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లక్షన్నరకు పైగా పెండింగ్ కేసులు ఉండగా, కొత్త కోర్టుల ఏర్పాటుతో కేసుల సంఖ్య 85,461కి తగ్గిందన్నారు. చాలా ఏళ్ల తర్వాత న్యాయ వికేంద్రీకరణ జరిగిందని చెప్పారు.
సంక్షేమ పాలనే ధ్యేయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ఒక్కరి కోసం న్యాయవ్యవస్థ పని చేయదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ స్వార్థపరుల కోసం పనిచేసే వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణకు సంబంధించి నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. త్వరలో ఖాళీగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. పరిధులు దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య మనుగడ సాగాలంటే న్యాయ వ్యవస్థ కీలకం అన్నారు. న్యాయ వ్యవస్థకు అందరూ మద్దతివ్వాలని తెలిపారు.
