సీఎం కేసీఆర్ మళ్లీ చండీయాగం
- veegam team
- Published On : January 10, 2019 / 03:54 AM IST
సిద్దిపేట : సీఎం కేసీఆర్ మళ్లీ చండీయాగం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్వయంగా కేసీఆర్ యాగం ఏర్పాట్లను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీరనుమతితో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు.
యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యాగం ఏర్పాట్లను అష్టకాల రామ్మోహన్శర్మ, శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ పర్యవేక్షిస్తున్నారు. 2015లో అయుత చండీయాగం, శాసనసభ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సంగతి విధితమే.
