CM KCR : వరాల జల్లు : జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేసుకుని... చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
- murthy
- Published On : June 22, 2021 / 05:05 PM IST
Cm Kcr In Vasalamarri Village
CM KCR : వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేసుకుని… చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపటి నుంచే గ్రామంలో అందరూ కష్టపడి అభివృధ్ది చేయాలని అన్నారు. ఒక్క గ్రామం బాగుపడితే దాని చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. భువనగిరి యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ఈరోజు జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ ఆయన జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయితీకి ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి రూ.25 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నానని చెప్పారు.
జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల్లో 5 మున్సిపాల్టీలకు ఒక్కో దానికి 50 లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి కోటి రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నానని తెలిపారు. ఈనిధులతో గ్రామాలు, మున్సిపాల్టీల్లో అభివృధ్ధి పనులు చేయాలని సూచించారు. గ్రామంలో పాతకక్షలు వదిలేసి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేసీఆర్ అన్నారు. వాసాలమర్రిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈప్రత్యేక నిధులతో అవసరమైన చెరువులు, చెక్ డ్యాంలు బాగు చేసుకుందామని అన్నారు.
అంతకు ముందు ఆయన గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామసభలో గ్రామస్తులను ఉద్దేశించి ఇక నుంచి అందరూ ఒకే కులంగా మసలుకోవాలని, అభివృద్ధే కులంగా మసలుకోవాలని ఇకనుంచి వాసాలమర్రి కూడా నా కుటుంబమే అని అన్నారు. ఈరోజు నుంచి వాసాలమర్రి బంగారు వాసాలమర్రి గా మార్చుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని…. ఈ కమిటీలు బాధ్యత జిల్లా కలెక్టర్ అప్పగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
