Padma Awardees : శిల్పకళా వేదికగా వెంకయ్య నాయుడు, చిరంజీవిసహా పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం
పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
- Harishth Thanniru
- Published On : February 4, 2024 / 12:01 PM IST
CM Revanth Felicitates Padma Awardees
Shilpakala Vedika : జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఈ పురస్కారాలు వరించాయి. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం శిల్పకళా వేదికగా సన్మానించింది. పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు శాలువా కప్పి, మెమెంటోను అందజేసి సన్మానించారు.
Also Read : Guntur Kaaram : గుంటూరు కారం ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుండో తెలుసా?
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతాఇంతా కాదని అన్నారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని అనిపిస్తోందని పేర్కొన్నారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నంది అవార్డులు ఇవ్వడం లేదనే నిరుత్సాహం కళాకారుల్లో ఉందని, ప్ర్రభుత్వ పరంగా కళాకారులకు ప్రోత్సాహం ఉండాలని చిరంజీవి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడం సముచితం అని చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో హుందాతనం తగ్గిందని చిరంజీవి అభిప్రాయ పడ్డారు. రాజకీయాల్లో మాట అనడం, మాట పడటం నా వల్ల కాదు.. దుర్భాషలాడే నాయకులను తిప్పికొట్టే శక్తి ప్రజలకే ఉందని అన్నారు. సామాజిక సేవ చేయాలనే లక్ష్యంతోనే బ్లడ్ బ్యాంక్ పెట్టానని అన్నారు. మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా.. డ్యాన్సులు చేస్తూనే ఉంటా.. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటానని, అంతేకాక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటానని చిరంజీవి అన్నారు.
