Bhatti Vikramarka : టీఆర్ఎస్, బీజేపీని ఏకిపారేసిన భట్టి విక్రమార్క
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.
- Sreehari A
- Published On : November 12, 2021 / 05:19 PM IST
Congress Bhatti Vikramarka Slams Trs, Bjp
Bhatti Vikramarka : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ధాన్యం కొనుగోలుపై పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్లే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలో పాలించే బీజేపీ, రాష్ట్రాన్ని పాలించే టీఆర్ఎస్ రెండు పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. మరి కొనాల్సింది అమెరికానా? పాకిస్తానా? ధాన్యం కొనాల్సిన మీరే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం మీకు చేతన కావడం లేదా? అధికారంలో ఉండి ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీళ్ల పాలనతో రాష్ట్రాన్ని దేశాన్ని 20ఏళ్లు వెనక్కి నెట్టేశారని భట్టి ఏకిపారేశారు.
కేంద్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ధర్నాలతో రైతులను గందరగోళంలో పడేస్తున్నారని భట్టి మండిపడ్డారు. ధర్నాలతో పాలన చేతకాదని, రైతులను కాపాడలేమని చెబుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. అందులోభాగంగానే ధర్నాలతో డ్రామాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
Read Also : AP Minister Perni Nani : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్
