Dharmapuri Srinivas passes away : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున 3గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో శ్రీనివాస్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్. ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
Also Read : వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?
1948 సెప్టెంబర్ 27న జన్మించిన డి. శ్రీనివాస్.. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గానూ పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు. 2004లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : పార్టీలు మారినా మారని తలరాత.. ఆ ముగ్గురు సీనియర్లను వెంటాడుతున్న దురదృష్టం..!
ధర్మపురి శ్రీనివాస్ రెండు దఫాలుగా మంత్రిగా కొనసాగారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సోనియా గాంధీకి విధేయునిగా డీఎస్ గుర్తింపు పొందారు. గత ఎన్నికల తరువాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.